అనగనగా ఓ సినిమా.. ఒకటేంటి చాలా వాటిల్లో ఇదే సీన్ ఉండొండొచ్చు. రెండు వర్గాల మధ్య గొడవలుంటాయి. ఒకసారి వాళ్లు కలుసుకున్నారు. లీడర్లు ఒకరిపై ఒకరికి అనుమానంతోనే కౌగలించుకున్నారు. ఇంతలో ఓ లీడర్పై కోడిగుడ్డో.. ఏదో ఒకటి పడింది. మీరే వేశారని వాళ్లు.. కాదు మీరే వేసుకుని మాపై నిందలు వేస్తున్నారని వీళ్లు.. నవ్వుకుంటూనే అనుకున్నారు. దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కొంచెం అటూఇటూగా ఇదే సంఘటన ఆంధ్రా ప్యారిస్లో జరిగింది.. బహుశా ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. తెనాలినే అలా పిలుస్తుంటారు. ఇక్కడ తెలుగుదేశం – జనసేన పార్టీల మధ్య రాజకీయాలు కొంతకాలంగా హాట్హాట్గా ఉన్నాయి. ఇద్దరు బలమైన నేతల మధ్య వార్ పీక్స్లో ఉంది. పైకి అంతా బాగుందని చెబుతున్నా.. ఎత్తుకు పైఎత్తులతో నేతలు ముందుకు సాగుతున్నారు.
టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తెనాలి టికెట్ ఆశించారు. అందుకు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఈ సీటును తన సన్నిహితుడైన నాదెండ్ల మనోహర్కు ఇప్పించుకున్నాడు. రాజాకు మరోచోట అవకాశం కల్పిస్తామని బుజ్జగించే ప్రయత్నం జరిగింది.
గురువారం మనోహర్, టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసారి చంద్రశేఖర్ తెనాలిలో జనచైతన్య పాదయాత్ర నిర్వహించారు. బోసురోడ్డులోని సేన కార్యాలయం నుంచి మొదలై వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. ఆ సమయంలో రాజా వచ్చి వారిని కలిశారు. ఆయన వర్గీయులు మద్దతుగా నినాదాలు చేశారు. సేన కార్యకర్తలు మనోహర్కు మద్దతుగా అరిచారు. దీంతో తోపులాట జరిగింది. ఓ వ్యక్తి వాటర్ బాటిల్ను నాదెండ్లపై విసిరారు. ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నించినా బలంగా తలపై తగిలింది.
రాజాకు టికెట్ రాకపోవడంతో ఆయన మనుషులే ఇలా చేశారని.. జనసైనికులు ఆరోపిస్తున్నారు. కాదు వాళ్లే చేసుకుని.. ఎన్నికల్లో తమ పాత్ర లేకుండా చేయాలని చూస్తున్నారని ఆలపాటి వర్గం చెబుతోంది. ఇద్దరూ ఎవరికి వారు అంతంకాదిది.. ఆరంభం మాత్రమే అంటున్నారు. ఎందుకో వాళ్లకే తెలియాలి. తమని ఇబ్బంది పెడుతున్నారని రాజా వెళ్లి చంద్రబాబుకు చెప్పినా ఏమీ అనరు. ఎందుకంటే ఇప్పుడు పవనే కావాలి. అదే మనోహర్ గట్టిగా అనుకుని సేనానిపై ఒత్తిడి తెచ్చే రాజా సీటే చించేస్తారు. ఈ కథలో నీతి ఏంటంటే.. ఆకెళ్లి ముళ్లు మీద పడినా.. ముళ్లొచ్చి ఆకు మీద పడినా.. మిగతా పదం మీకు తెలుసుగా..