నరసరావుపేట లోక్ సభ సమస్వయకర్తగా నియమితులైన తరువాత తొలిసారి మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు (ఫిబ్రవరి 14, 2023) పల్నాడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు.
నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఈ దఫా బీసీలకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించడంతో అనిల్ కుమార్ యాదవ్ సమన్వయకర్తగా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యం లో అనిల్ రాక సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేసి కార్యకర్తల పరిచయ కార్యక్రమంతో పాటు వైఎస్సార్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయనున్నారు.
పర్యటన ఇలా.. అనిల్ కుమార్ యాదవ్ ఉదయం 11 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు చిలకలూరిపేట కల్యాణి సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ స్థానిక సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి కోటప్పకొండపై త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించి ప్రార్థనలు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నరసరావుపేట రూరల్ మండలం పెట్లూరివారిపాలెం వద్ద నుంచి స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా నరసరావుపేట పట్టణానికి చేరుకోనున్నారు.
అనంతరం.. అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్ లో సాయంత్రం 5 గంటలకు బహిరంగసభ జరగనుంది. పార్టీ జిల్లా సమన్వయకర్త విజయసా యిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న ఈ బహిరంగసభకు జిల్లావ్యాప్తంగా భారీసంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.