అసెంబ్లీ టికెట్ల కోసం తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఇంకా సీట్లను ఖారారు చేయలేదు. ఈ నేపథ్యంలో పోటీ చేసేది మేమే అంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇది టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో జనసేనానికి పవన్ కళ్యాణ్ మాత్రం తనకేం పట్టనట్లుగా ఉన్నారు. ఎందుకంటే బాబు ఎన్ని సీట్లు ఇచ్చినా చాల్లే అనే భావన ఆయనది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సేన నాయకులు ఒప్పుకోవడం లేదు. తాజాగా విజయవాడ పశ్చిమ అభ్యర్థిత్వం విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇక్కడ ఇరు పార్టీల నడుమ గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీరుపై సేన నాయకులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఇక్కడ సేన నేత పోతిన మహేష్ పోటీ చేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వెంకన్న మాత్రం ఒప్పుకోవడం లేదు. టికెట్ తనకే ఇవ్వాలంటూ గురువారం తన అనుచరులతో దుర్గ గుడి వరకు ర్యాలీ చేశారు. చంద్రబాబు నాయుడికి ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. బయటకు వచ్చి నానా హంగామా చేశారు. నాకు విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చానన్నారు. సీటు కేటాయించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దర్నీ కోరుతున్నాని చెప్పారు. అయితే ఈ వ్యవహారం జనసేన నేతలకు మింగుడు పడటం లేదు. ఎక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఈ సీటును వెంకన్నకు ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ సీట్లు ప్రకటించుకోవడంపై పవన్ను కలిసి నిలదీయాలని సేన నేతలు భావిస్తున్నారు.