తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేసేందుకు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) పాకులాడుతున్నారు. స్వార్థంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఈయన చంద్రబాబు నాయుడి చేత టీడీపీ కండువా కప్పించుకున్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. డబ్బులిచ్చి తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ తీసుకున్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన జిల్లా పెద్ద పాత్ర పోషించిన వీపీఆర్కు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు పెద్దపీట వేయలేదు. కొత్తలో నామమాత్రంగా కలిసి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీ సస్పెండ్ చేయడంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారితోనే సన్నిహితంగా ఉంటున్నారు. వారి ద్వారా ఎలాగైనా పార్టీలో పెద్దన్న పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ తెలుగు తమ్ముళ్లు దీనికి అంగీకరించడం లేదు.
కోవూరులో చాలా మంది తెలుగుదేశం నాయకులున్నారు. కానీ వీపీఆర్ వారిని నమ్మడం లేదు. ఒకనాటి వైఎస్సార్సీపీ నాయకుడు రూప్కుమార్కు అక్కడి బాధ్యతలు అప్పగించారు. ప్రశాంతిరెడ్డి కేవలం ప్రచారానికి పరిమితం కాగా మిగిలిన విషయాలను రూప్ చక్కబెడుతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వీపీఆర్పై విమర్శలు చేశారు. జగన్ చేరదీసి అందలమెక్కిస్తే పదవులు అనుభవించి వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. డబ్బులిచ్చి అనేకమందిని కొనుగోలు చేసుకున్నారని చెప్పారు. దీనిపై పాత టీడీపీ నాయకులు స్పందించలేదు. కానీ వీపీఆర్ తన వర్గంగా ఉన్న రూప్, నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ద్వారా ప్రసన్నను నానా మాటలు అనిపించారు. వేమిరెడ్డి అండతో కోవూరు పార్టీలో రూప్ పెత్తనం చేయడాన్ని సీనియర్ తమ్ముళ్లు సహించలేకపోతున్నారు.
టీడీపీలో వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. నేతల మధ్య విభేదాలున్నాయి. దీంతో ఎవరినైనా ప్రత్యర్థులు విమర్శిస్తే మరో వర్గం వారు స్పందించరు. పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న అజీజ్ టికెట్ రాలేదనే బాధతో చాలా విషయాలను పట్టించుకోవడం లేదు. దీనికితోడు ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గాలో వారు బిజీగా ఉండడంతో వేమిరెడ్డి ఇదే మంచి తరుణమని పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. నేతలపై ప్రత్యర్థులు మాట్లాడితే తన మనుషులైన రూప్, శ్రీధర్రెడ్డి ద్వారా తిట్టిస్తూ ఇక్కడంతా నా మాటే చెల్లుతుందనే సంకేతాలను సీనియర్లకు పంపుతున్నారు.
సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీచర్స్ ఎమ్మెల్సీ అయిన పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. నారాయణ లేదా ఆయన మనుషులు, లేక జిల్లా పార్టీ స్పందించాలి. కానీ వీపీఆర్ వర్గానికి చెందిన రూప్ ప్రెస్మీట్ పెట్టి పర్వతరెడ్డిని తిట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యపోతున్నారు. పార్టీని క్రమంగా వీపీఆర్ ఆక్రమిస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని వాపోతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశంలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందోననే చర్చ నడుస్తోంది.