నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తొలుత రామ్మూర్తి నగర్లోని క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం విజయసాయిరెడ్డి నెల్లూరులోని కలెక్టరేట్కు చేరుకుని ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట స్నేహితుడు, రాజ్యసభ్య సభ్యుడు బీద రవిచంద్ర, కుమార్తె నేహారెడ్డి తదితరులున్నారు. క్యాంప్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను ఘనంగా సన్మానించారు.
నామినేషన్ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 1952 తొలి సార్వత్రిక ఎన్నికలతో నెల్లూరు పార్లమెంట్ స్థానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎంతోమంది మహనీయులను ఇక్కడి ప్రజలు లోక్సభకు పంపారు. అలాంటి చోట తనకు అవకాశం ఇవ్వడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను. ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తా. వారు మెచ్చే స్థాయిలో పనిచేస్తా. నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ‘నా సొంత గడ్డ నెల్లూరు ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మద్దతుగా నిలిచిన ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదాలు.’ అంటూ పోస్టు చేశారు. కాగా నామినేషన్ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.