ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగ్గా ఎంపీ పాల్గొన్నారు. ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కన్నెర్ర చేశారు. ఆయన ఏమన్నారంటే.. 2004లో తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఎన్నికల్లో లాభం పొందాలని ఇలా చేసింది. ఏపీకి పది సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారు. అయితే అలా జరగలేదు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో హోదా అంశాన్ని ఎందుకు పెట్టలేదు?, చట్టంలో చేర్చడం చేతగాక, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు?, కాంగ్రెస్కు హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడొచ్చి దీనిని ఎన్నికల అంశంగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఇన్చార్జి ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. హోదా ఇవ్వాలని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని చాలాసార్లు కోరారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ చాలా ద్రోహం చేసి విలన్గా మారింది. ఇప్పుడు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. ఆంధ్రాలో ఆ పార్టీ ఎప్పుడో అదృశ్యమైంది. జాతీయ స్థాయిలోనూ కనుమరుగు కావడం ఖాయం.