ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఆ వ్యూహాల్లో కుల సమీకరణాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాగా తాజాగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. ఇప్పుడీ భేటీ చర్చనీయాంశంగా మారింది.
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్న వంగవీటి రాధాకు 2019లో గుంటూరు వెస్ట్ సీటు కాకుండా,గుంటూరు ఈస్ట్ సీటు కానీ మచిలీపట్నం ఎంపీ సీటు కానీ కేటాయించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయింది. దాంతో పాటు ఎమ్మెల్సీ సీటును కూడా ఆఫర్ చేసింది. కానీ వంగవీటి రాధా చంద్రబాబు సీటు కేటాయిస్తాడన్న హామీతో టీడీపీలో చేరారు. కానీ చంద్రబాబు టికెట్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించారు. దీంతో వంగవీటి రాధా తీవ్ర నిరాశ చెందారు.
2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వంగవీటి రాధా పేరు లేదు. కాగా వంగవీటి రాధా పార్టీని వీడితే కాపు ఓట్లకు గండి పడే అవకాశం ఉందని అవకాశం ఉందని గుర్తించిన చంద్రబాబు, కాపు ఓట్లు చేజారకుండా పెద్ద వ్యూహం రచించాడు. టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనలో వంగవీటి రాధను చేరిస్తే కాపు ఓట్లు చేజారావని భావించి నాదెండ్ల మనోహర్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్లను రాధా కలిశారు. వంగవీటి రాధాకు కాపుల్లో ఉన్న గుర్తింపును ఉపయోగించుకుని తనని తమ కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో వాడుకుని కాపుల ఓట్లను కొల్లగొట్టాలనే ప్రణాళికలో భాగంగా నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే టీడీపీని నమ్ముకుని రాజకీయంగా నష్టపోయిన రాధాని పావుగా వాడుకుంటున్నారని చంద్రబాబు ఆడే రాజకీయ చదరంగంలో బలి కావొద్దని పలువురు సన్నిహితులు వంగవీటి రాధకు సలహాలిస్తున్నట్లు సమాచారం. మరి తాజా ప్రపోజల్ కి వంగవీటి రాధా ఒప్పుకుంటాడో లేదో కొన్ని రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది.