మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే.
జనసేనకి దక్కిన రెండు పార్లమెంట్ స్థానాలలో కాకినాడ ఎంపీగా టీ టైం ఉదయ్ పోటీ చేయనున్నారని పవన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ రెండో స్థానమైన మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. బాలశౌరికి టికెట్ దక్కదని కొందరు, వేరే స్థానాన్ని బాలశౌరికి కేటాయించి, మచిలీపట్నం స్థానం నుండి నాగబాబును పోటీ చేయించనున్నారని ఊహాగానాలు కూడా నడిచాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ బాలశౌరి పేరును ఖరారు చేశారు.
కాగా అభ్యర్థి పేరును ఆలస్యంగా ఖరారు చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్లేందుకు తగిన సమయం లేదని బాలశౌరి వాపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తిరిగి వారాహి ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నాడు. ఈ ప్రచారంలో భాగంగా చిట్టచివరిగా మచిలీపట్నంలోనే పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. తన గెలుపుకోసం పవన్ సరిగా శ్రద్ద పెట్టకపోవడం బాలశౌరికి మింగుడుపడటం లేదు. పొత్తులో భాగంగా మంచిలిపట్నం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ అవనిగడ్డ జనసేనకు మిగిలిన అన్ని నియోజకవర్గాలు టీడీపీకి దక్కాయి. కాగా టీడీపీ,జనసేన ఓట్ల బదిలీ జరిగితేనే ఆయా నియోజకవర్గాల్లో గెలుపు సాధ్య పడుతుంది. కానీ ఓట్ల బదిలీ జరిగే అవకాశం కనిపించకపోవడంతో మచిలీపట్నంలో బాలశౌరికి గెలుపు అనుమానమే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ల బదిలీ జరిగిందో లేదో బాలశౌరి గెలుపోటములతో తెలిసిపోతుంది.