ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ముగ్గురు ఐఏఎస్లతోపాటు, ఆరుగురు ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షాలతో పాటు ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, చిత్తూరు ఎస్పీ జాషువా, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, బదిలీ చేయాలని ఎన్నికలు సంఘం ఆదేశాలు జారీ చేసింది.
కాగా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సంఘం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమనే చెప్పాలి. బదిలీ చేసిన అధికారులను ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని ఈరోజు సాయంత్రం 5గంటల్లోగా బదిలీ చేయాలని, కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు పంపారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమితో హోరాహోరీగా తలపడనుంది. సీఎం జగన్ తన సంక్షేమ పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని నమ్ముతూ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీకి దిగుతుండగా మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని కూటమి బలంగా విశ్వసిస్తుంది.