ఈ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్ నీ కుర్చీ మడప పెట్టేస్తామనే డైలాగ్ను తెగ వాడేస్తున్నారు. ప్రతి సభలో ఇదే చెబుతున్నారు. మొన్న లోకేశ్ ఇనుప కుర్చీని ముడిచి పిల్ల చేష్టలు చేశారు. వారికి ఇప్పుడు గొప్ప అవకాశం దక్కింది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా చంద్రబాబు రా కదలి రా, లోకేశ్ శంఖారావం పేర్లతో సభలు నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా వాటికి జనం నుంచి స్పందన శూన్యం. అసలు తెలుగు తమ్ముళ్లే వారు చెప్పే సోది వినలేమంటూ సభలకు వెళ్లడం తగ్గించేశారు. జనసేనాని పవన్ ఆదేశాలతో జనసేన కార్యకర్తలు మాత్రం పోక తప్పడం లేదు. అయితే వారిని టీడీపీ నేతలు ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుని చితకబాదుతున్నారు.
తండ్రీకొడుకుల మాటల్లో కొత్తదనం లేకపోవడంతో సభలు వెలవెలబోతున్నాయి. ఎంత సేపటికీ జగన్ను తిట్టడంతోనే సరిపెడుతున్నారు. బాబు అయితే హైదరాబాద్ను కట్టా.. ప్రపంచపటంలో పెట్టానంటూ విసిగిస్తూనే ఉన్నారు. ఇంకా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే కారణం నేనే. సాఫ్ట్వేర్ తెచ్చింది.. ఉద్యోగాలిచ్చింది నేనేనంటూ డబ్బా కొట్టుకోవడం ఆపలేదు. అనేక సంవత్సరాల నుంచి ఇదే చెబుతున్నారు. దీంతో డబ్బులిచ్చి బతిమిలాడి తీసుకొచ్చిన జనం సభల మధ్యలోనే వెళ్లిపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల జనం రావడం లేదని చెప్పుకొని కవర్ చేసుకోవాల్సి వస్తోంది.
శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు రా కదలి రా సభలో చంద్రబాబు ఖాళీ కుర్చీలకు తన రొటీన్ ప్రసంగం వినిపించారు. కొద్దిరోజుల క్రితం నెల్లూరులో జరిగిన సభలోనూ ఇదే పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా వేపగుంట, లక్కవరపుకోటలో జరిగిన శంఖారావం సభల్లో లోకేశ్ ప్రసంగం వినలేక పార్టీ శ్రేణులే బారికేడ్లు దూకి పారిపోయాయి. చినబాబు తెలుగును కూనీ చేస్తుండటంతో ప్రతి చోటా ఇదే జరుగుతోంది.
కుర్చీ మడత పెట్టేస్తాం డైలాగ్ను వాడుకుంటున్న బాబు, లోకేశ్ తమ సభల్లో ఆ పనిని నింపాదిగా చేసుకోవచ్చని సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. సీఎం జగన్ కుర్చీని మడత పెట్టడం మీ తరం కాదు. మీ సభలకు జనం రాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలను లెక్కపెట్టి ప్రశాంతంగా మడతపెటుకోండని సలహా ఇస్తున్నారు. నిజమే కదా.. అలా అయినా సంతోషపడొచ్చు.