ఎన్నికల నియమావళిని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కానీ ఎల్లో మీడియా ఈ విషయాలను దాచేసి వైఎస్సార్ కాంగ్రెస్పై బురద వేసే పనుల్లో నిమగ్నమైంది. దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అయిన రాజశేఖర్ భాకరాపేటలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేశారు. రాయచోటికి చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి వెళ్తుండగా టీడీపీ నాయకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ విషయాలు ఎస్పీ దృష్టికి వెళ్లగా విచారించి అతడిని సస్పెండ్ చేశారు.
చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఆలయాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ కండువా కప్పుకొని వెళ్లి పూజలు చేయడం కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల అధికారి హైమావతి వెళ్లి చెప్పినా పట్టించుకోలేదు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి సచివాలయ ఏఎన్ఎం లత టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని ఆర్టీసీ కాలనీలో తెలుగు తమ్ముళ్లు చీరలు పంపిణీ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. ఇక విశాఖపట్నం 8వ వార్డు గొల్లల ఎండాడలో ఓటర్లను ప్రభావితం చేసేలా టీడీపీ, జనసేన నాయకులు బసవతారకం, గీతం ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రచారానికి పూనుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కోడ్ను ఉల్లంఘించి ఆత్మీయ సమావేశం పెట్టారు. అడ్డుకున్న అధికారులపై తెలుగుదేశం నేతలు గొడవకు దిగారు. దీంతో కేసు నమోదైంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికల కోడ్ను లెక్క చేయడం లేదు. ఆయా పార్టీల అధిష్టానాలు చెప్పడంతోనే ఇలా వ్యవహరిస్తారని తెలుస్తోంది.