నేను నీ నీతులు చెబుతా.. కానీ పాటించను.. ఈ ధోరణిలో ఉన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీని నడిపేందుకు తన వద్ద డబ్బు లేదని, అందుకే సినిమాలు చేస్తున్నానని అనేకసార్లు కట్టు కథలు చెప్పాడు. తన కార్యకర్తలు, అభిమానుల నుంచి విపరీతంగా విరాళాలు వసూలు చేశాడు. తీరా చూస్తే తెలుగుదేశం నీడలో ఉంటూ సేనకు భారీగానే ప్యాకేజీ అందుకుంటున్నాడు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటకు రాగా ఆయన బాగోతం బయట పడింది.
2019 – 21 మధ్య గుర్తింపు లేని పార్టీలు ఎలాంటి బాండ్లను స్వీకరించలేదు. జనసేన మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసింది. 2002లో రూ.2 కోట్లు, 23లో రూ.2 కోట్లు, 24లో ఏకంగా రూ.17 కోట్లు కలిపి మొత్తం రూ.21 కోట్లు అందుకుంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల కమిషన్కు జనసేన 2021–22, 2022–23 ఆడిట్ రిపోర్టు సమర్పించగా అందులో రూ.4 కోట్ల బాండ్ల వివరాలను పొందు పరచలేదు. 2023–24 రిపోర్టు ఇంకా సమర్పించాల్సి ఉంది. మరి ఈ రూ.17 కోట్లు చూపిస్తారో.. లేదో..
పవన్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. సేనకు మొదటి నుంచి ఆర్థికంగా అండగా ఉంది టీడీపీనని జగమెరిగిన సత్యం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసినా డబ్బు సర్దింది బాబేనని విమర్శలున్నాయి. ఓ వైపు బీజేపీతో పొత్తులో ఉన్నా సేనాని నారా వారితో స్నేహం కొనసాగించారు. 2024లో ఎన్నికల ఖర్చంతా బాబే భరిస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక పవన్ తన ముసుగు తొలగించారు. పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసీఐ గుర్తింపు లేని సేనకు 2024లో ఏకంగా రూ.17 కోట్లు బాండ్ల రూపంలో వచ్చిందంటే దీని వెనుక ఎవరి హస్తం ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ప్యాకేజీని ఈ విధంగా ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. నిద్ర లేచింది మొదలు తను చాలా మంచి వాడినని, ఇంత గొప్ప వ్యక్తిని చూడడం మీ అదృష్టమని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే సేనాని బాండ్ల విషయాన్ని దాచి ఆడిట్ రిపోర్టు సమర్పించి మోసం చేయాలని చూశారని స్పష్టమవుతోంది. బీజేపీ అండ చూసుకుని ఇలా చేశాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఏమని సమాధానం చెబుతాడో..