2024-25 విద్యా సంవత్సరంలో బోధన ప్రమాణాలు మరింత పెరగాలని వాటికి అనుగుణంగా వచ్చే వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని విద్యాశాఖ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విదేశాలతో పోటీపడే విద్య వ్యవస్థని తీసుకొచ్చామని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకి ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు మరింత సమయం కేటాయించి వివిధ మార్గాల ద్వారా పాఠ్యాంశాలపై లోతైన శోధన చేసి సిద్ధమవ్వాలని కోరారు.
ఈ నెల 23న 2023 2024 విద్యా సంవత్సరం ముగియడం, కొత్త విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రారంభం కానుండటంతో ఈ మధ్యకాలంలో ఉండే 47 రోజుల సమయాన్ని విద్యాబోధనలో మెలుకువలు నేర్చుకునేందుకు వినియోగించాలని ఉపాధ్యాయులను గురువారం ఒక ప్రకటన ద్వారా కోరారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రముఖ విద్యా నిపుణుడు డౌగ్ లెమోవ్ రాసిన టీచ్ లైక్ ఏ ఛాంపియన్ అనే పుస్తకం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దాదాపు 49 బోధనా పద్ధతులు నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. తద్వారా ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా తమను తాము మార్చుకొని విద్యార్థులకు మరింత గొప్పగా బోధన చేయవచ్చన్నారు.
పుస్తకంలో పొందుపరిచిన 1-10 స్కేల్ ద్వారా ఇప్పటికే ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పద్ధతులను తనిఖీ చేసుకోవడంతో పాటు టెక్నికల్ గా ఎంత ప్రభావవంతంగా బోధిస్తున్నామన్న విషయం నిర్ధారించుకొని స్వీయ విశ్లేషణ చేసుకోవచ్చన్నారు. అంతిమంగా మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధనతో పాటు బంగారు భవిష్యత్ అందించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ అత్యుత్తమ బోధన ద్వారా బాటలు వేస్తారని భావిస్తున్నానని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.