తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు సంగతేమో గానీ.. ఇరు పార్టీల కార్యకర్తలు మాత్రం క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకుంటున్నారు. ఓ వైపు నాయకులు సీట్లు తమకే అంటూ విలేకరుల సమావేశాలు పెడుతున్న విషయం అధిష్టానాలకు తలనొప్పి పుట్టిస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో సీఎం పోస్టు విషయమై పోస్టులు, కామెంట్ల వార్లు నడుస్తున్నాయి.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగు తమ్ముళ్లు జనసైనికులను చితకబాదారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మంగళవారం చంద్రబాబు రా కదలి రా సభ జరిగింది. ఈ సమయంలో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కొంతమంది జనసైనికులు నినాదాలు చేశారు. దీంతో పొత్తులో భాగంగా చంద్రబాబే సీఎం అభ్యర్థి అని టీడీపీ కార్యకర్తలు గట్టిగా వారించారు. దీంతో ఇరుపక్షాల నడుమ గొడవ మొదలైంది. జెండా కూలీకి 25 సీట్లే ఎక్కువని తమ్ముళ్లు నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో గొడవ కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఒక్కసారిగా దేశం కార్యకర్తలు దాడికి దిగారు.
చంద్రబాబు సమక్షంలోనే ఈ తంతంగమంతా జరగడం విశేషం. ఆయన కనీసం వారించలేదు. సభ టీడీపీది కావడంతో అక్కడ ఆ పార్టీ వారే అధికంగా ఉన్నారు. దీంతో సేన కార్యకర్తపై రెచ్చిపోయారు. పుత్తూరు చెందిన ఒక కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఇదిలా ఉండగా సభా ప్రాంగణంలో జనసేన జెండాలు లేకపోవడంపై జీడీ నెల్లూరు అధ్యక్షుడు సురేష్ రెడ్డి మండిపడ్డారు.