టీడీపీ – జనసేనతో ఎప్పుడైతే పొత్తు ప్రకటించిందో అప్పటినుండి టీడీపీకి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. పలువురు సీనియర్ నాయకులకు కూడా టీడీపీ తరపున సీట్ ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజుల ముందు మండపేట, అరకు నియోజకవర్గాల అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అందుకు ప్రతిగా రాజోలు, రాజానగరం తరపున అభ్యర్థులను ప్రకటించి రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ పొత్తుధర్మం పాటించాల్సిన అవసరం ఉందని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న తరుణంలో బీజేపీ కూడా పొత్తు అంటూ మధ్యలోకి రావడంతో అభ్యర్థుల ఎంపిక మరింత కష్టతరంగా మారింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తుంటే టీడీపీ జనసేన తరపున సీట్ ఆశిస్తున్న ఆశావహులకు ఎలాంటి స్పష్టత ఆయా పార్టీలనుండి రాకపోవడం ఇబ్బందికరంగా మారింది.
ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా లేని తరుణంలో అభ్యర్థులను ప్రకటించలేకపోవడం టీడీపీ జనసేన పార్టీల దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. అభ్యర్థులను ప్రకటిస్తే తాము నియోజకవర్గాల్లో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేసుకుంటామని ఆయా పార్టీల తరపున టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల మనోగతంగా కనబడుతుంది. పొత్తుధర్మంపై పవన్ కళ్యాణ్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం మూలంగా చంద్రబాబు కూడా ధైర్యంగా అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సమన్వయకర్తలను ప్రకటించడంతో ఆయా స్థానాల్లో టీడీపీ తరపున సీట్ ఆశిస్తున్న ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. యలమంచిలి, గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల సమన్వయకర్తలను పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో టీడీపీ నేతల్లో ఉలికిపాటు మొదలైందనే చెప్పొచ్చు. యలమంచిలి నుంచి ప్రగఢ నాగేశ్వర్ రావు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్, పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ, భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ టీడీపీ తరపున సీట్ ఆశిస్తుండగా పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఇన్ఛార్జ్లను ప్రకటించడం టీడీపీకి మింగుడుపడటం లేదు.
ఇప్పటికే టీడీపీ తరపున సీట్ కోసం బుద్ధా వెంకన్న రక్తాభిషేకం చేయడం విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి ఎంపీ కానీ తనకు కేటాయించాలని కోరడం టీడీపీ అధినేతకు కలవరపాటును తెప్పించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. బుద్ధా వెంకన్న కోరుకుంటున్న అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో నాగబాబును బరిలోకి దింపాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనకాపల్లిలో టీడీపీ నుంచి చింతకాయల విజయ్, బైరా దిలీప్ టికెట్ ఆశించడం ఇరు పార్టీలకు సంకట స్థితిగా మారిపోయింది. ఎవరు టికెట్ త్యాగం చేస్తారు? ఎవరికి సీట్ కేటాయిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఆటలో అరటిపండులా బుద్ధా వెంకన్న రక్తాభిషేకంతో వార్తల్లో నిలవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ఈనెల 22 న పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలవనున్న తరుణంలో ఇప్పటికైనా పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం ఉంటుందా లేక పొత్తుకే ఎసరు వస్తుందా అనే సందేహాలు సామాన్య ప్రజల్లో కూడా మొదలైంది. ఒకవేళ మూడు పార్టీల మధ్య పొత్తుకు సయోధ్య కుదిరితే ఎవరికి టికెట్ దక్కుతుంది. ఎవరికి మొండి చెయ్యి చూపించే అవకాశం ఉందనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పొత్తు ఉంటే మాత్రం సామాజిక ఆర్థిక సమీకరణాల దృష్ట్యా పలువురు సీనియర్ నేతలకు కూడా టీడీపీ తరపున టికెట్ దక్కే అవకాశం ఉండదని సమాచారం. ఈ నేపథ్యంలో టికెట్ లభించని ఆశావహులు పార్టీకి విధేయంగా పనిచేస్తారా లేక పార్టీకి ఎదురు తిరుగుతారా అనే మీమాంసలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. పొత్తులేమో కానీ పార్టీ చిత్తయ్యే పరిస్థితి ఏర్పడిందని పలువురు సీనియర్ నేతలు సన్నిహితుల దగ్గర వాపోతున్నారని సమాచారం.