ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు వారికి ఓ పేరు కావాల్సి వచ్చింది. ఎన్నో తర్జనభర్జనల తర్వాత రా కదలి రా అంటూ చంద్రబాబు నాయుడు సభలు ప్రారంభించారు. ఆ పేరుతో అనేక చోట్ల సభలు నిర్వహించగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అటు టీడీపీ.. ఇటు జనసేన కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇక లోకేశ్ శంఖారావం సభల పరిస్థితి అంతే. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరుతో నాలుగు సభలను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రమంతా వాటి గురించి చర్చించుకున్నారు. సభలకు వచ్చిన జన సునామీని చూసి కూటమికి షాక్ కొట్టింది. ఈనెల 27వ తేదీన నుంచి జగన్ మేము సిద్ధం పేరుతో ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నారు. సిద్ధం అనే పేరు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది.
తాను ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం కావడం లేదని అర్థం చేసుకున్న చంద్రబాబు ప్రతిసారి ఓ కొత్త పేరును తెరపైకి తెస్తున్నారు. కూటమి తొలి సభకు ప్రజాగళం అని నామకరణం చేశారు. రా కదలి రా, శంఖారావం పేర్లను అటకెక్కించారు. తాజాగా ప్రజాగళం పేరు మీదే జనంలోకి వెళ్లాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకూ వివిధ సభలు, రోడ్ షోలు ఏర్పాటు చేస్తారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్, 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో ప్రచారం చేస్తారు. సోమ, మంగళవారాల్లో కుప్పం నియోజకవర్గం వెళ్తారు.
ఎన్నికల సమయంలో సభలు, రోడ్షోలకు రాజకీయ పార్టీలు పేర్లు పెడుతుంటాయి. కొన్ని బాగా పాపులర్ అయితే.. కొన్ని తుస్సుమంటాయి. ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది. సిద్ధం పేరు జనానికి బాగా అలవాటైంది. టీడీపీ విషయంలో ఆ పరిస్థితి లేదనే చెప్పాలి.