41 ఏళ్ల టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతటి ఘోర అవమానం గతంలో ఎప్పుడూ జరగలేదు. రాజ్యసభలో టీడీపీ జెండా గల్లంతవడం టీడీపీ ఏర్పడిన అనంతరం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రబాబు అవలంబించిన విధానాలు పార్టీని నడిపించిన తీరు వల్లనే ఈ స్థితి దాపురించిందని టీడీపీ శ్రేణులు లోలోపల కుమిలిపోతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిని నిలిపే సాహసం కూడా టీడీపీ చేయలేకపోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనంగా చెప్పొచ్చు.
తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి గొల్ల బాబూరావులు మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ఈ మూడు స్థానాల గెలుపుతో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరుకోగా టీడీపీ ప్రాతినిధ్యం కనుమరుగైంది.
చింత చచ్చినా పులుపు చావదన్న చందాన టీడీపీలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తగినంత సంఖ్యా బలం లేకున్నా ప్రలోభాలను నమ్ముకుంది. ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి లాంటి టీడీపీ సీనియర్ నేతలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 30 – 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ప్రకటించారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందనే విధంగా టీడీపీ నుండి రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెడతామని బీరాలు పలికిన టీడీపీ నేతలు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఓటుకు నోటు వెదజల్లి ప్రలోభాలకు గురి చేసినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లొంగక పోవడం, రాజ్యసభ ఎన్నికలు ఓపెన్ బ్యాలెట్ పద్దతిలో జరగడం లాంటి కారణాల వల్ల టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టి పరువు పోగొట్టుకోవడం కంటే హుందాగా తప్పుకోవడం బెటర్ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. దాని ఫలితమే రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం తొలిసారిగా గల్లంతైంది.