ప్రజాక్షేత్రంలో గెలవలేమని భావించిన టీడీపీ దొంగ ఓట్ల నమోదుకు తెరలేపింది. కాగా తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్ల దందాకు ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. తప్పుడు సమాచారం తప్పుడు మార్గంలో నకిలీ ఓట్లు నమోదు కాకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. వైయస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల సంఘం డూప్లికేట్ ఓటర్లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. పక్క రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండి ఏపీలో ఓటు పొందాలని పట్టుబడితే జైలుకు కూడా పంపిస్తామని హెచ్చరించడంతో టీడీపీ ఖంగుతింది.
ఏపీలో కొన్ని నెలలుగా సాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు, తొలగింపు మార్పుపై అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఫార్మ్ 6 & ఫార్మ్ 8 ద్వారా అక్రమాలకు తెరలేపింది. ఈ విషయాన్ని గుర్తించిన వైయస్సార్సీపీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి వరుసగా పిర్యాదులు చేసింది. 2019 ఎన్నికలకు ముందు కూడా దాదాపు 60 లక్షల ఓట్లను అడ్డదారులలో నమోదు చేయించిందని అప్పట్లో ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17, 18 ప్రకారం ఒక ఓటర్ ఒక చోట మాత్రమే ఎన్ రోల్ అయి ఉండాలి. అలా కాకుండా ఒకచోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 31 ప్రకారం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఫార్మ్ 6 ని మొదటిసారి ఓటరుగా ఎన్ రోల్ అయ్యేవాళ్ళు మాత్రమే ఉపయోగించాలి. అలాకాకుండా ఓటు హక్కు కలిగి ఉండి కూడా మరోసారి ఫార్మ్ 6 ద్వారా ఓటు హక్కు కోసం ప్రయత్నిస్తే పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 31 ప్రకారం జైలు శిక్ష విధించొచ్చు. తప్పుడు సమాచారంతో ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండి ఏపీలో ఓటు హక్కు కోసం ప్రయత్నిస్తే అలాంటి వారిని గుర్తించి జైలు శిక్ష విధిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.