నరసారావుపేట అసెంబ్లీ టికెట్ విషయంలో అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు లావు శ్రీకృష్ణదేవరాయులు ఆడుతున్న ఆటలు ఓ సీనియర్ నాయకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. రోజుకో పేరు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చదవలవాడ అరవింద్బాబుకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే లావు అడ్డుపడుతూ తన సామాజికవర్గం వారికి సీటు ఇప్పించాలని చూస్తున్నారు. ఈ వ్యవహారంపై కొద్దిరోజులుగా తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు.
అరవింద్బాబుకే టికెట్ ఇవ్వాలంటూ పాలపాడుకు చెందిన పులిమి రామిరెడ్డి మీడియా సమావేశంలో ఏకంగా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ను మదర్ థెరిసా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. రామిరెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మార్కెట్ యార్డు చైర్మన్గానూ వ్యవహరించారు. అంతటి సీనియర్ నేత పార్టీ తీరును ఎండగడుతూ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడంటే టికెట్ విషయంలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి లావు శ్రీకృష్ణదేవరాయులు రాకతో పార్టీ స్వరూపం మారిపోయింది. ఆయన తన స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2019లో అరవింద్బాబు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనే ఇన్చార్జిగా ఉన్నారు. 2024లో టికెట్ తనకే ఇస్తామని బాబు చెప్పడంతో పనిచేస్తూ వచ్చారు. కానీ అధిష్టానం 2021లో నల్లపాటి రామును ప్రోత్సహించింది. అంతటితో ఆగలేదు. కడయాల వెంకటేశ్వరరావు అనే వ్యక్తిలో ఆశలు రేపింది. ఒకే సామాజికవర్గానికి చెందిన వీరు పార్టీ కార్యక్రమాలు చేస్తూ టికెట్ ఆశించారు. కడియాల ముమ్మరంగా తిరిగి అన్న క్యాంటీన్ పెట్టి హంగామా చేశారు. అయితే పార్టీ పెద్దల తీరుతో నొచ్చుకున్న ఆయన దానిని తీసేశారు. వైఎస్సార్సీపీ నుంచి అట్లా చినవెంకటరెడ్డిని చేర్చుకుని టికెట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆయన పేరు ఎక్కువ కాలం రేస్లో లేదు. బీసీ కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సంప్రదిస్తే విముఖత చూపారు. అంతే కాకుండా ఆయన లావు వెంట కూడా వెళ్లలేదు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఇక అరవింద్బాబే దిక్కని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయనకు సీటు రాకుండా లావు చక్రం తిప్పుతున్నారు. తన సామాజికవర్గం వారినే పెట్టాలని చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. దీంతో అరవింద్బాబుకు టికెట్ రాదనే ఆందోళనలో ఆయన వర్గం ఉంది. ఈ క్రమంలోనే రామిరెడ్డి పురుగు మందు తాగారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.