‘అందేంటి మేడం టికెట్ ఇవ్వలేదని ఏడ్చారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేస్తే చంద్రబాబు ద్రోహం చేశారని వాపోయారు. ఆయన నీచ రాజకీయాలకు బలయ్యానన్నారు. తిరుపతి సీటును జనసేనకు ఇవ్వడంపై పునరాలోచించాలని చెప్పారు. మా కార్యకర్తల మాటకు విలువ లేదా అంటూ ఆగ్రహించారు. ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ తిప్పేశారు’ ఇలా సుగుణమ్మను ఎవరైనా అడిగితే సినిమాలో విలన్లా నవ్వి ఊరుకుంటారు. ఈ మాజీ ఎమ్మెల్యే తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల సెంటిమెంట్ను బాగానే వాడుకున్నారు.
భర్త వెంకటరమణ చనిపోవడంతో సుగుణమ్మ తిరుపతి ఎమ్మెల్యే అయ్యారు. ఈమెకు ప్రజా బలం లేదు. 2019లో ఇష్టం లేకపోయినా చంద్రబాబు కులం ప్రాతిపాదికన సీటు ఇచ్చారు. కరుణాకర్రెడ్డి చేతిలో ఓడిపోయింది. తిరుపతిలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో అడపాదడపా ఆమే తిరుగుతూ వచ్చారు. 24లో ఎలా అయినా ఆమెకు టికెట్ ఎగ్గొట్టాలని అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి సుగుణమ్మ కూడా సెలైంట్ అయిపోయారు. అదే సమయంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
శ్రీనివాసులు పెద్ద కాంట్రాక్టర్. డబ్బు ఆశ చూపడంతో పవన్.. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆయన్ను తిరుపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. స్థానికేతరుడికి అవకాశం ఇవ్వడంపై అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులు, కార్యకర్తలు రగిలిపోయారు. సమావేశాలు పెట్టి ఇరు పార్టీల అధిష్టానాలకు అల్టిమేటాలు జారీ చేశారు. కానీ కొద్దిరోజులకు అంతా సర్దుకుంది. ఇదే సమయంలో సుగుణమ్మ తెరపైకి వచ్చారు. తన అల్లుడి సూచనలతో ఆమె నాటకాన్ని ప్రారంభించారు. శ్రీనివాసులు నుంచి డబ్బులు గుంజేందుకు కార్యకర్తల ఎమోషన్స్ను వాడుకున్నారు.
సుగుణమ్మ ప్రెస్మీట్ పెట్టి తిరుపతి టికెట్పై చంద్రబాబు, పవన్ మరోసారి చర్చించాలని కోరారు. ఉన్నపళంగా పార్టీలో చేరిన వారికి, అదీ వేరే జిల్లా వ్యక్తికి టికెట్ ఇస్తే జనం అంగీకరించరన్నారు. చిత్తూరుకు చెందిన ఆరణికి అవకాశం ఇవ్వడంపై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఈ విషయం మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఆమెకు మద్దతు పలికారు. చర్చ మొదలైంది. సుగుణమ్మ, ఆమె అల్లుడు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. తన సీటుకు ఎసరు పెట్టేలా ఉన్నారని భయపడిన ఆరణి వెంటనే కొందరు నేతల్ని రాయబారానికి పంపారు. తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, దంపూరి భాస్కర్, జేబీ శ్రీనివాసులు, పలువురు జనసేన నాయకులు సుగుణమ్మతో సమావేశమయ్యారు. ఆమె రూ.10 కోట్లతో బేరం మొదలుపెట్టినట్లు తెలిసింది. అయితే అవుట్ డేటెడ్ లీడర్ కావడంతో శ్రీనివాసులు అంత ఇవ్వనని, చివరికి రూ.2.50 కోట్ల తెగ్గొట్టినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. నగదు విషయం తేలడంతో సుగుణమ్మ తాపీగా జనసేన అభ్యర్థి కోసం పనిచేయాలని చెప్పారు. ఆయనకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆమె సీటును స్థానిక వ్యక్తికి వచ్చేలా చేస్తుందని నమ్మితే డబ్బు కోసం నాటకాలు ఆడిందని స్థానిక తమ్ముళ్లు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.