సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్ పై పెట్టిన పోస్టుల్లో అభ్యంతరకర భాగాన్ని తొలగించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధాన పార్టీలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. కాగా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ పై శృతి మించిన విమర్శలు చేస్తున్న టీడీపీ సోషల్ మీడియాపై లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సీఎం జగన్ పై విమర్శలు చేసారని నిర్ధారించి అచ్చెన్నాయుడికి సంబంధిత పోస్టులు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి అచ్చెన్నాయుడుని మాత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. తాజాగా చంద్రబాబు తన రాజకీయ వ్యూహంతో కావాలనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించారని కొత్త వాదన కూడా తెరపైకి వస్తుంది. ఎందుకంటే విశృంఖలంగా రెచ్చిపోతున్న టీడీపీ సోషల్ మీడియా వల్ల రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శృతిమించిన ట్రోలింగ్స్, అసభ్య పదజాలంతో కూడిన అభ్యంతరకర పోస్టులు టీడీపీ సోషల్ మీడియాలో పరిపాటిగా మారిపోయాయి.
సోషల్ మీడియాలో టీడీపీ కేడర్ అతి ఉత్సాహంతో ఎవరిని వేధించినా దూషించినా సంబంధిత నోటీసులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడికే అందుతున్నాయి. కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినా అచ్చెన్నాయుడినే మధ్యలో పెట్టి చంద్రబాబు, లోకేష్ సేఫ్ గేమ్ ఆడుతున్నారనే వాదనా తెరపైకి వస్తుంది. సోషల్ మీడియా కారణంగా ఎదుర్కోవాల్సిన కేసులను అచ్చెన్నాయుడు వైపు మళ్లించడానికే రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా ట్రోలింగ్స్ కారణంగా గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై పోలీసులు దృష్టి పెట్టారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ సోషల్ మీడియా మరిన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టే అవకాశం కూడా ఉంది. మరి సామాజిక మాధ్యమాలలో టీడీపీ కేడర్ చేసే హల్చల్ కు అచ్చెన్నాయుడు బాధ్యత వహిస్తారా లేక చంద్రబాబులా జారుకుంటారా? వేచి చూడాలి.