పేదలకు స్పెషలిస్ట్ వైద్య సేవలు
వైద్య, ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం సర్వజన ఆస్పత్రుల్లో పేదలకు స్పెషలిస్ట్ వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా డాక్టర్ల నియామకాలను చేపట్టింది. కడప రిమ్స్లో జనరల్ మెడిసిన్లో 6 విభాగాలు, సర్జరీలో 5 విభాగాలను 452 పడకల సామర్థ్యంతో సెంట్రల్ ఏసీ విధానంలోకి త్వరలో ఐపీ వైద్య సేవలను ప్రారంభించనున్నారు. •జనరల్ మెడిసిన్లో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండో ట్రైనాలజీ, కార్డియో థొరాసిక్ వ్యాక్యులార్ సర్జన్,• జనరల్ సర్జరీలో న్యూరోసర్జరీ, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీలలో వైద్య సేవలను అందించనున్నారు. వీటిని మాస్టర్ ఆఫ్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ ఛెరహనీ (ఎంఎస్, ఎంసీహెచ్)లు పర్యవేక్షిస్తారు. రాయలసీమ జిల్లాలకే తలమానికమైన రిమ్స్లో పేదలకు అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా క్యాథ్ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీని పనులు చకచకా జరుగుతున్నాయి. గుండె జబ్బుల వైద్యానికి సంబంధించి ఇప్పటి వరకూ ప్రాథమిక పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి సంపూర్ణ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. యాంజియోగ్రామ్లు, స్టెంట్లు ఇక్కడే వేస్తారు. గుంటూరు జీజీహెచ్లో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీంతో నిరుపేద, మధ్య తరగతులకు చెందిన హృద్రోగులకు ఎంతో ప్రయాజనం కలుగుతుంది. నెల్లూరులోని జీజీహెచ్లో కూడా కొత్త వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నారు. న్యూరాలజీ, యూరాలజీ విభాగాలకు డాక్టర్లను నియమించారు. ఓపీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో కార్డియాలజీ సేవలు అందుబాటులో రానున్నాయి.
బందరు ఆస్పత్రికి అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. దీంతో పాత వైద్యులు, సిబ్బంది బదులు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. దీనికి తోడు పలు విభాగాలకు అధునాతన వైద్య పరికరాలు మంజూరయ్యాయి. కంటి, ఎముకలు వంటి విభాగాల్లో గతంలో ఎన్నడూ చేయని విధంగా అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. జనరల్ ఆస్పత్రిగా ఉన్న దీనిని సూపర్ స్పెషాలిటీగా మార్చేందుకు చర్యలు చేపడుతూ రాష్ట ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం నూతన వైద్య విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలుత న్యూరాలజీ, యూరాలజీ విభాగాలను మంజూరు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయా విభాగాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ఈనెల 18వ తేదీ నుంచి ఈ రెండు విభాగాల్లో ఓపీ ప్రారంభం కానుంది. న్యూరాలజీ, యూరాలజీకి సంబందించిన వ్యాధులతో బాధపడే రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి.