ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో సీఎం జగన్ తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రజలతో మరింత మమేకం కావడానికి 21 రోజులపాటు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. కాగా సీఎం జగన్ మొదటి మూడు రోజుల బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా కొనసాగనుంది.
మొదటి మూడు రోజుల బస్సు యాత్ర షెడ్యూల్
27 వ తేదీన ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్ధనల అనంతరం నివాళి అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరు(వయా వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల) బయలుదేరుతారు. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం అక్కడినుంచి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డకు (వయా దువ్వూరు, చాగలమర్రి) కు చేరుకుని రాత్రికి బస చేస్తారు.
28 వ తేదీన ఆళ్లగడ్డనుండి బయలుదేరి (వయా నల్లగట్టు, వెంకటాపురం) మీదుగా నంద్యాలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం (వయా పాణ్యం,ఓర్వకల్లు) మీదుగా నాగలాపురం చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 29 వ తేదీన కొత్తూరు నుండి బయలుదేరి (వయా కోడుమూరు,గోనెగండ్ల మీదుగా) ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి (వయా బనవాసి,ఆస్పరి మీదుగా) పత్తికొండ చేరుకొని రాత్రికి అక్కడ బస చేస్తారు.