ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం హోరాహోరీగా మారుతోంది. వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో 2019 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయటం లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సీట్లు రాని కూటమి నేతలను తమ వైపు తిప్పుకొనేందకు ప్రయత్నం చేస్తోంది. కర్నూలు జిల్లాలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.
జిల్లాలో ఏరాసు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాపరెడ్డి ఎమ్మెల్యేగా పని చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏరాసుకు సీటు దక్కలేదు. దీంతో ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించారు. తొలి నుంచి వైఎస్సార్ కుటుంబంతో ఏరాసుకు సత్సంబంధాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఏరాసు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. కానీ తాజాగా వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లటంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో టీడీపీలో నెలకొన్న పరిస్థితులన తమకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లాలో జగన్ మేమంతా సిద్దం యాత్ర సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలతో సమీక్షలు చేసారు. ప్రచారంలో వస్తున్న స్పందన..సర్వే నివేదికలు..కూటమి వ్యూహాల పైన అభ్యర్దులకు దిశా నిర్దేశం చేసారు. కర్నూలు జిల్లాలో 2019 తరహాలోనే ఫలితాలు ఉండాలని నిర్దేశించారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి తో పాటు , కేఈ ప్రభాకర్ సైతం టీడీపీ వీడి వైఎస్ఆర్సీపీలో చేరాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కేఈ ప్రభాకర్ కుమారుడు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ నెలలో 12, 13 తేదీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని సమాచారం.