2014 ఎన్నికలలో విజయం సాధించిన జి.శంకర్, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాలను చురుగ్గా చేశాడు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్ర రెడ్డిని ఖరారు చేసిన నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం ఆగ్రహంతో రగిలిపోయారు. 2014 ఎన్నికలలో విజయం సాధించిన జి.శంకర్, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాలను చురుగ్గా చేశాడు. లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ తానై చూసుకుని, గత 4 సంవత్సరాలుగా పదుల కోట్ల రూపాయిలు ఖర్చు చేయించి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిత్వం నీకే అంటూ పలుసార్లు హామీ ఇచ్చిన చంద్రబాబు తాజాగా వేరొకరికి టికెట్ ప్రకటించడంతో జి.శంకర్ వర్గం ఆగ్రహ జ్వాలలతో అలజడి సృష్టించారు. జి.శంకర్ కార్యాలయంపైన ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను, జెండాలను పీకి రోడ్డున విసిరేశారు. మండల కేంద్రాలైన బి.కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లెలో చంద్రబాబు దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. తంబళ్లపల్లె నియోజక వర్గంలో టీడీపీ ఓటమికై కృషి చేస్తామంటూ పెద్ద ఎత్తున్న నిరసన గళాలను వినిపించారు.
టీడీపీ సీనియర్ నాయకుడు , అవనిగడ్డ మాజీ శాసన సభ్యులు , నవ్యాంధ్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పేరు కూడా మొదటి లిస్ట్ లో లేదు. తన పేరు లేకపోవడం చూసి తనకు బాధ లేదు అంటూనే పంజరం లోంచి బయటికి వచ్చిన పక్షిలాగా ఉందంటూ రాజకీయంలో డబ్బే కొలమానం అయినప్పుడు నాబోటివాడు ఎన్నికలలో నిలబడాలని ఆశించడం సమంజసం కాదంటూ ఎక్స్ వేదికగా తన బాధను ఇలా పంచుకున్నారు.
ఈ రోజు మొదటి విడత లిస్ట్ లో నా పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను. పంజరం లోంచి బయటకు వచ్చిన పక్షి లాగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉంది. దయచేసి కార్యకర్తలు,నాయకులు ఇది గమనించి వ్యవహరించండి.
నా ఆలోచనలు, నేను నమ్మిన సిద్ధాంతాలు మీకు తెలుసు. పదవులకోసం పుట్టలేదు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదు.
రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ఓటరుని కొనుగోలు వస్తువుగా రాజకీయపక్షాలు భావిస్తున్న తరుణంలో ధనవంతులకోసం అన్వేషిస్తున్న తరుణంలో నాబోటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదు. పరిస్థితులను కార్యకర్తలు, ప్రజలు అర్ధం చేసుకోండి. దయచేసి వేరే విధంగా ఆలోచించవద్దు అంటూ ఎక్స్ వేదికగా బుద్ధ ప్రసాద్ పోస్ట్ చేశారు