ప్రవీణ్ ప్రకాష్. ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సీఎం ఆలోచనలకు తగినట్లుగా ప్రవీణ్ పనిచేస్తూ ఆ శాఖలో తనదైనముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం బడులను సందర్శిస్తూ.. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాయా? లేదా? ఆరాతీసే కార్యక్రమాన్ని కొంతకాలం నిర్వహించారు. విద్యార్థుల విషయంలో రాజీ పడకుండా వారికి అన్ని వసతులు కల్పించడంలో విజయవంతమయ్యారు. దీంతో ఆయన్ను అందరూ అభిమానిస్తారు. గతంలో పనిచేసిన ప్రతిచోటా ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
గతంలో ప్రవీణ్ ప్రకాష్ గుంటూరు నగర పాలకసంస్థ కమిషనర్గా పనిచేశారు. 2000 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఓ ఘటన జరిగింది. ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడి తనలోని మానవతా దృక్పథాన్ని ఆయన బయటపెట్టారు. అనుకోకుండా ఈ విషయం నేడు వెలుగు చూసింది. ఆనాడు కంకరగుంట రైల్వే గేటు వేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. అప్పుడు గేటు వద్ద ఒక స్కూటర్ వస్తోంది. ఫాతిమాపురం లైన్కు చెందిన వెంకటేశ్వర్లు, మరో విద్యార్థి బడి నుంచి వస్తూ రోడ్డు దాటుతుండగా ఆ స్కూటర్ ఢీకొని కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రవీణ్ పిల్లలను చూసి చలించిపోయారు. తన హోదాను పక్కనపెట్టి డిప్యూటీ మేయర్ రాజేంద్రప్రసాద్, కార్పొరేటర్లు రాజేష్, పెదవెంగయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ దాసరి శేఖర్బాబును అప్రమత్తం చేసి వారిని తన జీపులో ఎక్కించుకొని స్వయంగా పట్టాభిపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అరగంటపాటు అక్కడే ఉండి వైద్య చికిత్స చేయించి వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పాక ఊపిరి పీల్చుకుని తన విధులకు వెళ్లారు.
ఇలా అతికొద్దిమంది అధికారులే చేస్తారు. చాలామంది స్పందిస్తారు. కానీ వేరే వాహనంలో తరలించి తమ దారిన తాము వెళ్లిపోతారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ లాంటి అరుదైన సివిల్ సర్వెంట్లు తక్కువగా ఉంటారు. మానవతా దృక్పథం గల వ్యక్తి కావడంతో స్వయంగా తన వాహనంలో తీసుకెళ్లడమే కాకుండా దగ్గరుండి చికిత్స చేయించి బాగోగులు చూసుకున్నారు. పిల్లలంటే ఆయనకు మొదటి నుంచి ఉన్న ఇష్టం కాబోలు.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో తెచ్చిన కీలకమైన మార్పుల్లో తనవంతు పాత్ర పోషించారు.