Hospitals : ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి వారి ప్రాణాలను నిలిపారు ప్రభుత్వ వైద్యులు. గుంటూరు జీజీహెచ్ లో రోగికి అరుదైన పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ తొలగించగా, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో(Hospitals) బాలిక ఛాతీలో ఉన్న కణితిని తొలగించారు.
వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావుకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో గుంటూరు జీజీహెచ్లో చేరారు. అతిగా మద్యం సేవించడం వల్ల పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఏర్పడ్డాయని పరీక్షల్లో తేలడంతో జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్స చేసారని, శస్త్ర చికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకుంటున్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ వెల్లడించారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒక బాలికకు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మకు ఛాతీలో గుండె పక్కన న్యూరో ఫైబ్రోమా అని పిలిచే గడ్డ వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ కణితిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ బాలిక త్వరలోనే పదవ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఆమె ఎక్కువ నెలలు విశ్రాంతి తీసుకోవాలి. దాంతో వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించి పద్మ ప్రాణాలు నిలిపారు ప్రభుత్వ వైద్యులు. కాగా ఆమె వేగంగా కోలుకుని పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతుందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సను కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్వోడీ డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి నిర్వహించడం విశేషం.