తెలుగు రాష్ట్రాలను విభజిస్తూ హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని విభజన హామీల్లో కేంద్రం పొందుపరిచినా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు ఎరవేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రి అమరావతికి రాజధానిని తరలించారు. అప్పటికప్పుడు తాత్కాలిక భవనాలు నిర్మించి తన అనుకూల పత్రికల్లో గ్రాఫిక్స్ మాయాజాలంతో సింగపూర్ నిర్మాణాలు అంటూ ఊదరగొట్టారు. అప్పుడే చంద్రబాబుతో పాటు మరికొందరు కీలక నాయకులు అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణానికి తెరతీశారు. ఆ క్రమంలోనే మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ లీలలు కూడా మొదలయ్యాయి.
నిబంధనలకు విరుద్ధంగా అమరావతి రైతుల వందల ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకోవడానికి నారాయణ కొత్త పథకం రచించాడు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా రైతులను ఒప్పించారు. అనంతరం తమ బినామీలైన ఉద్యోగులతో కలిసి అతి తక్కువ ధరలకు అసైన్డ్ భూములను కొనిపించి నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా పథకం రచించారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. ఇక్కడితో నారాయణ ఆగలేదు. నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్స్పైరా’ అనే కంపెనీనే ఏర్పాటు చేసి తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్పలను డైరెక్టర్లుగా నియమించాడు. ఈ ‘ఎన్స్పైరా’ కంపెనీ ద్వారా రాజధాని ముసుగులో చంద్రబాబుతో కలిసి నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు.
రాజధాని నెపంతో భూములు కొల్లగొట్టడం కోసం ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపించారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఎన్స్పైరలో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. ఈ విధంగా రెండు విడతల్లో ఎన్స్పైరలోకి రూ.1,013.27 కోట్లు రావడం గమనార్హం. అనంతరం నల్లధనాన్ని ఎన్స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం తాము నియమించుకున్న బినామీల ద్వారా ఆ నగదు డ్రా చేశారు.
ఈ విధంగా భూ దందాను రక్తి కట్టించిన నారాయణ ఇప్పుడు ఏకంగా టీడీపీ గెలుపు కోసం ఫండ్స్ కలెక్ట్ చేసే కేంద్రాలుగా తన నారాయణ విద్యా సంస్థలను మార్చడం గమనార్హం. చుట్టుపక్కల ఉన్న మార్వాడీలు వద్ద నుండి డబ్బు కలెక్ట్ చేసి, ఎన్నికల ఫండ్ గా వినియోగించనున్నట్లు సమాచారం. కాగా ఈ నగదును ఎక్కడికి తరలించి ఉంటారన్న కోణంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.