2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్లో పరిధిలో పర్యటన చేయనున్నారు. రాజమండ్రిలో ప్రధాని మోడీ సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం లేనట్లు సమాచారం.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రానున్న నరేంద్ర మోడీ ఈరోజు రాజమండ్రి , అనకాపల్లి పార్లమెంట్ల పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు విరామం తీసుకుని తిరిగి 8వ తేదీ మధ్యాహ్నం పీలేరులో జరిగే సభలో పాల్గొని అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో మోడీ పాల్గొంటారని షెడ్యూల్ ఖరారు అయింది. ఇప్పటికే బిజెపి అభ్యర్థుల తరఫున బిజెపి కేంద్ర నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా ప్రచారం చేసి వెళ్లారు. నేడు ప్రధాని రాకతో కేంద్రంలోని బిజెపి పెద్దలందరూ ఆంధ్రాలో ప్రచారం చేసినట్లు ఉంది.
మోడీ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకొని అక్కడ బిజెపి తరఫున పోటీ చేస్తున్న పురందేశ్వరికి మద్దతుగా జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సభకి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం లేదు. ఆ సభకు కూటమి తరుపున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు సమాచారం. రాజమండ్రిలో సభ ముగియగానే నరేంద్ర మోడీ అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకొని అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతుగా జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీ తిరిగి ఎనిమిదో తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో పాల్గొంటారు.