ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది దఫాలుగా సమన్వయ కర్తలను ప్రకటించిన సీఎం జగన్ సిద్ధం సభల ద్వారా తమ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉందని చాటి చెప్తున్న విషయం తెలిసిందే. తమ సంక్షేమ పాలన ఫలితంగా వైఎస్సార్సీపీకి 2024 ఎన్నికల్లో ప్రజలు మెజారిటీ స్థానాలను కట్టబెట్టనున్నారని సీఎం జగన్ తో పాటు ఆ పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. కాగా వైఎస్సార్సీపీ విడుదల చేయబోయే మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.
సీఎం జగన్ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తారన్న సంగతి తెలిసిందే. అంత పవిత్రంగా భావించే మేనిఫెస్టోను ఎక్కడ నుండి ప్రకటిస్తారన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. కాగా ఈ ప్రశ్నకు సమాధానాన్ని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, బాపట్ల జిల్లాలోని మేదరమిట్లలో జరగనున్న సిద్ధం సభలో వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. దీంతో వైఎస్సార్సీపీ విడుదల చేయబోయే మేనిఫెస్టోపై ప్రజల్లో అంచనాలు మొదలయ్యాయి.
కాగా సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ను వైఎస్సార్సీపీ నేతలు విడుదల చేయగా మేదరమిట్లలో జరగనున్న సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 2019 మేనిఫెస్టోలో నవరత్న పథకాలతో పాలనను కొత్త పుంతలు తొక్కించిన సీఎం జగన్ తన పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరిస్తూనే రాబోయే కాలంలో చేయబోయే మంచిని గురించి సిద్ధం సభలో వెల్లడిస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టో విడుదల చేయనున్నారని తెలియడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది.