ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు ఇచ్చే హామీలు వరద గోదారిలా జనాన్ని ముంచి వేసేట్టు ఉన్నాయి . గత ఏడాది సూపర్ సిక్స్ అంటూ బాబు ఇచ్చిన హామీల విలువ దాదాపు ఏడాదికి లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకొన్నవి. ఇది రాష్ట్ర సరాసరి ఆదాయం కన్నా కూడా ఎక్కువ. ఈ కోవలోనే ఇప్పుడు మరో హామీ వదిలారు బాబు. బీసీ కులాల్లో యాభై ఏళ్ళు దాటిన అందరికీ పెన్షన్ ఇస్తామని నిన్న జయహో బీసీ సభలో వరం ఇచ్చేసారు.
ఇన్నిన్ని హామీలు ఇస్తున్నాడు అసలు చంద్రబాబు ధైర్యానికి మెచ్చుకోవచ్చు అంటారా, అక్కడే ఉంది అసలు కిటుకు, హామీలు ఇవ్వటమే తప్ప అమలు చేయటం, నెరవేర్చటం అనే పదాలకు చంద్రబాబు డిక్షణరీలో చోటు లేదు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు ఎన్టీఆర్ పధకాలకు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ విధించిన మద్యపాన నిషేధం ఎత్తేసాడు. కిలో రెండు రూపాయల పధకం, సగం ధరకే జనతా వస్త్రాల పధకం అన్నీ ఎత్తేసాడు, అంతే కాదు 1999 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకపోవటంతో 2004 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందాడు బాబు.
2014 ఎన్నికల నాటికి విభజిత రాష్ట్రానికి తన అవసరం ఉందంటూ పలు పార్టీలతో పొత్తులు పెట్టుకొని అమలుకి సాధ్యం కాని హామీలు 650 ఇచ్చి గద్దెనెక్కిన బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరు నిమిషంలోనే రైతు, డ్వాక్రా రుణ మాఫీల పై మాట మార్చడంతో పాటు అయిదేళ్ల పాలనా కాలంలో 650 హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు వాటిని అన్నిటిని గుర్తు చేసుకోలేకపోయినా ప్రస్తుత హామీ బీసీలకు 50 ఏళ్ల పెన్షన్ కి అనుబంధంగా ఉండేవి కొన్నిటిని చూద్దాం .
2014 మేనిఫెస్టోలో గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఒక్క గిరిజనుడికి కూడా 50 ఏళ్లకి పెన్షన్ ఇవ్వలేదు.
2019 ఏప్రిల్ ఒకటిన చేనేతలకు వర్షాకాల భృతి ఇస్తామని లోకేష్ ప్రకటించాడు . 2019 మేలో చంద్రబాబు అధికారం కోల్పోయాడు కాబట్టి నెరవేర్చలేదు అనుకొందాం. కానీ 2023 మార్చ్ న యువగళం పాదయాత్రలో చేనేతలతో జరిగిన సమావేశంలో అయిదేళ్లపాటు చేనేతలకు వర్షా కాల భృతి ఇచ్చామని అతి పెద్ద అబద్దం చెప్పాడు లోకేష్.
స్కాలర్షిప్ ల కోసం బీసీల ఆదాయ పరిమితి రెండున్నర లక్షలకు పెంచుతామని 2014 మేనిఫెస్టోలో చెప్పారు కానీ ఈ చిన్న హామీ కూడా అమలు చేయలేదు.
చేనేతలకు ఇల్లు మగ్గం షెడ్డు కలిపి లక్షన్నర ఖర్చుతో నిర్మిస్తామని అదే మేనిఫెస్టోలో చెప్పి ఎగగొట్టారు. మళ్ళీ 2023 పిబ్రవరిలో యువగళం యాత్రలో జరిగిన చేనేత సమావేశంలో ఇదే హామీ మళ్ళీ ఇచ్చాడు లోకేష్.
బీసీ వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటల్స్, వృద్దాశ్రమాలు కడతానని కూడా 2014 మేనిఫెస్టోలో చెప్పాడు కానీ ఒక్కటి కూడా నిర్మించిన పాపాన పోలేదు.
చెప్పుకొంటూ పోతే బాబు ఎగగొట్టిన హామీల లిస్టు ముందు కొండవీటి చాంతాడు చిన్నబోతుంది. ఆయన ఇప్పుడిచ్చే హామీలు కూడా ఎన్నికల ఓడ దాటిన తర్వాత ఓటరు బోడి మల్లన్న సామెతే.