‘నాకు అధికారం కావాలనుకుంటే ఎంతో సేపు పట్టదు. నాతో ప్రధానమంత్రి ఎంత సన్నిహితంగా ఉంటారో సీఎం రమేష్ను అడగండి.. ఎంపీ పదవి లేక మంత్రి పదవి కావాలంటే నేను ఆయన్ను అడిగి తెచ్చుకోగలను. కానీ నాకు కావాల్సింది ప్రజల భవిష్యత్. ఆడబిడ్డలకు భద్రత ఉండాలి. వారికి ఉపాధి అవకాశాలు దక్కాలి. పథకాలు అందరికీ చేరాలి’ అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలివి. సినిమాల్లో హీరో లేదా విలన్ పక్కన సైడ్ క్యారెక్టర్లు ఉంటాయి. చాలా సీన్లలో వాళ్లు బకరాలు అవుతుంటారు. నటుడైన సేనాని నిజ జీవితంలో తన అభిమానగణాన్ని రోజూ బకరాలు చేస్తుంటారు.
2014లో రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి పవన్ రకరకాల వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సభలు, సమావేశాల్లో ఆయన్ను గమనిస్తే మాటలు మార్చడంలో దిట్ట అని సులువుగా అర్థమవుతుంది. నేతలు, కార్యకర్తల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఎమోషన్స్ తో ఆడుకునేలా మాట్లాడుతుంటాడు. ఒకసారి ప్రజాసేవ చేయడమే నాకు ముఖ్యం. దానికి అధికారం అవసరం లేదంటాడు. ఇంకోసారి మీ వల్లే 2019లో ఓడిపోయాను.. నన్ను కనీసం ఎమ్మెల్యేను కూడా చేయలేయపోయారని తిట్టేస్తాడు. సీఎం.. సీఎం అని అరవొద్దంటాడు. మరోసారి కానివ్వండి అరవండంటాడు. ఇటీవల పిఠాపురంలో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపండంటూ పవన్ బతిమిలాడుకున్నాడు. నాకంటూ కొందరిని ఎమ్మెల్యేలను ఇచ్చి అసెంబ్లీకి పంపాలని కోరాడు. మళ్లీ అంతలోనే అనకాపల్లికి వెళ్లి పదవులు కావాలనుకుంటే తీసుకునేందుకు ఎంతో సేపు పట్టదని అనేశాడు. పవన్ ప్రసంగాలు ప్రజల కోణంలో ఉండవు. తన అభిమానుల అలరించడానికే సినిమా డైలాగులు చెబుతుంటాడు.
ఇప్పటికే పవన్ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం గ్రహించిన ప్రతిసారి తాను అత్యంత బలవంతుడినని చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా యువకుడు మోటార్బైక్లో వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపితే నాకు రాజకీయ నాయకులు తెలుసు.. పోలీసులు తెలుసని బిల్డప్ ఇస్తాడు. అచ్చం అలాగే పవన్ మీటింగుల్లో తన అభిమానులతో నాకు పీఎం, సెంట్రల్ హోం మినిస్టర్, బీజేపీ చీఫ్ తెలుసు. వాళ్ల ఫోన్ నంబర్లు తెలుసు. చాలా సన్నిహితంగా ఉంటారంటాడు. తాజాగా అనకాపల్లిలోనూ పీఎం తనతో ఎంతో బాగుంటారని పదవులు కావాలనుకుంటే అడిగేయగలనన్నారు. ఇక్కడే కొందరు జనసైనికులకు అనుమానాలు వస్తున్నాయి. అంతమందితో పరిచయాలుంటే ఒక్క బీజేపీతోనే పొత్తులో ఉండొచ్చు కదా అంటున్నారు.
టీడీపీని ఎన్డీఏలోకి తీసుకెళ్లడానికి తిట్లు తిన్నానని చెప్పాడు సేనాని. అంత అవసరం ఏమిటి?, ఎవరి కోసం ఇదంతా చేశాడు. కమలం పార్టీతోనే ఉండుంటే చెరి సగం సీట్లలో పోటీ చేసే అవకాశం ఉండేది. రాజకీయంగా పార్టీ ఎదిగేది. కేంద్రంలో బీజేపీ సాయంతో ప్రజలకు సేవే అవకాశం కూడా దక్కేది. కానీ అలా చేయకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విసిరేసిన 21 సీట్లు తీసుకున్నాడు. అందులోనూ సగం వరకు టీడీపీ వారినే చేర్చుకుని ఇచ్చాడు. దీంతో పవన్ అభిమానులు తీవ్రంగా నొచ్చుకున్నారు.
అసలు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్కు ఏ మాత్రం లేదు. చంద్రబాబుకు సేవ చేయడమే తన లక్ష్యం. 2014 నుంచి ఆయన వేసిన అడుగులు చూస్తే అదే తెలుస్తుంది. ఆడబిడ్డలకు భద్రత ఉండాలి. వారికి ఉపాధి అవకాశాలు దక్కాలన్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల ట్రోలింగ్ వల్ల గీతాంజలి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జగన్ ఇల్లు ఇచ్చారని చెప్పడంతో ఎల్లో సైకోలు రెచ్చిపోయారు. దీనిపై పవన్ కనీసం మాట్లాడారు. ఇది తప్పని చెప్పలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రుణమాఫీ ఎగ్గొట్టాడు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేదు. మరి ఆయన నీడనే చేరి తన అభిమానులకు నీతి వాక్యాలు వల్లిస్తున్నాడు. పవన్ మోసం చేస్తూనే ఉంటాడు. అతని అభిమానులు మోసపోతూనే ఉంటారు. ఈ ప్రక్రియ ఆగదు.