తిరుపతి సీటును ఏ ముహూర్తాన తన పార్టీకి తీసుకున్నాడో గానీ అప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తలనొప్పులు మొదలయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయిష్టంగానే ఈ టికెట్ వదులుకున్నారు. సేనానిపై ఎంతో మంది జనసైనికులు ఆశ పెట్టుకుంటే.. ఆయన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నుంచి రూ.50 కోట్లు తీసుకుని తిరుపతిలో అవకాశం కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
చిత్తూరు జిల్లా వాసికి సీటు ఇవ్వడం అటు సేన నేతలకు, ఇటు టీడీపీ నాయకులకు ఏ మాత్రం నచ్చలేదు. పైగా ఆరణికి జన బలం లేదు. దీంతో కిరణ్ రాయల్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నాలుగు రోజులు అరిచారు. చంద్రబాబు మోసం చేశారని గగ్గోలు పెట్టారు. కానీ అభ్యర్థి నుంచి రూ.2.50 కోట్లు తీసుకుని ఆమె సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. శుక్రవారం పవన్ తిరుపతికి బయలుదేరారు. ఆరణి విషయంలో చాలామంది జనసైనికులు వెనక్కి తగ్గకపోవడంతో వారితో సమావేశం కానున్నట్లు తెలిసింది.
డబ్బు తీసుకున్నారు కదా.. వచ్చి సెటిట్ చేయాలని శ్రీనివాసులు ఒత్తిడి తీసుకురావడంతో సేనాని పనులన్నీ పక్కనపెట్టి వెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ, సేన నేతలతో మాట్లాడతారు. వారిని బుజ్జగించి ఎలా అయినా ఆరణి అభ్యర్థిత్వానికి ఒప్పించాలని చూస్తున్నారు. అయితే అంతా ఒకతాటిపైకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. స్థానికుడికే అవకాశం ఇవ్వాలని సేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు ఆరణి ప్రచారం చేస్తున్నా.. పెద్దగా స్పందన లేదు. నేతలెవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఇతర పార్టీల వారికి టికెట్లు ఇచ్చి సొంత వారికి అన్యాయం చేశాడని సేనానిపై విమర్శలున్నాయి. ఆయన అడుగులన్నీ అటువైపే పడ్డాయి. మరి సమావేశంలో ఏమి చెప్పి ఒప్పిస్తాడో ఆసక్తికరంగా మారింది. అలకబూని, సహకరించమని బెదిరించి అందరూ తన డబ్బు తినేస్తున్నారని ఆరణి సన్నిహితుల వద్ద వాపోతున్నారు. తిరుపతిలో చక్రం తిప్పుదామని చూసిన పవన్కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.