ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు నేతల్ని ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆయనకు వారిని విమర్శించే అర్హత లేదని అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ని ఎన్నికల్లో ఓడించకపోతే నా పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని, కాపు సంక్షేమం కోసం ఒక ఉద్యమం కూడా చేయని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రశ్నిస్తారని, పవన్ కళ్యాణ్ తనకు తాను కాపు నాయకుడిగా ప్రకటించుకోవడం సిగ్గుగా ఉంది అని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలను కాపు రిజర్వేషన్ ఎందుకు అడగలేదని పవన్ అడుగుతున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలను అడిగే హక్కు మీకెక్కడిదని ముద్రగడ ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
కాపు ఉద్యమంలో మీ పాత్ర లేదు, సానుభూతి కూడా చూపించలేదు. కాపు రిజర్వేషన్ పై అనేక సంవత్సరాలు నేను పోరాడితే ఏ రోజు కూడా సహకరించిన పాపాన నువ్వు పోలేదు. కాపు రిజర్వేషన్ పై మీకున్న విజ్ఞత ఏంటి ? నేను చవటను, దద్దమ్మను, ఆవేశం లేని వాడినే కానీ మీకు అవన్నీ ఉన్నాయిగా మీరెందుకు రోడ్డెక్కలేదు?. నా అంతట నేనే కాపు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కాను. జగన్ సాధ్యం కాదంటే నోర్మూసుకుని కూర్చున్నాను. ఇస్తానన్న వారిని అడక్కపోవడం తప్పు కాదా, ఇవ్వనన్న వారిని అడగడం తప్పా ?. కాపు రిజర్వేషన్ ఇస్తానన్న చంద్రబాబును ఏ రోజు ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్?. 2014లోనే పొత్తులోనే ఉన్నారు కాపులకి ఏమి మేలు చేయని చంద్రబాబుతో ఎందుకు జతకట్టారని ముద్రగడ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ మీది ఏ ఊరు, ఏ మండలం, జిల్లా తెలియజేయాలి?. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చేయాలా? మా జిల్లా వాళ్లంటే లోకువా? నీకు ఎమ్మెల్యే కావాలని ఉంటే హైదరాబాద్ లో పోటీ చేయొచ్చుగా? రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే నువ్వు నాయకుడిగా అనర్హుడువని ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ని దుయ్య బట్టారు.