‘పాలిటిక్స్లో కొత్త తరం రావాలంటే రిటైర్మెంట్ చాలా అవసరం. సీనియర్లు తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాలి’ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి. ఇందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో సీనియర్లను పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. మీకు సీట్లు ఇవ్వనని తెగేసి చెబుతున్నారు. సీనియర్లు, బాబును నమ్ముకున్న వారి సీట్లను జనసేన లాక్కుండడంతో వారు అవమానకర రీతిలో రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
గంటా శ్రీనివాసరావు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. మాజీ మంత్రి. ఇప్పుడు ఈయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గంటా భీమిలి నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు వద్ద ప్రతిపాదన కూడా పెట్టారు. అయితే ఇటీవల జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ను పవన్ ఇన్చార్జిగా ప్రకటించేశారు. దీంతో గంటాకు దిక్కుతోచడం లేదు. తాను సీనియర్నని, భీమిలిలోనే అవకాశం ఇవ్వాలని బాబును కలిసి అడిగితే చెప్పింది చేయాల్సిందేనన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని ఆదేశించారు. ఇందుకు గంటా ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు ఆయన్ను సీనియర్ అనే గౌరవం లేకుండా యూజ్లెస్ ఫెలో.. గెటవుట్ అన్నారని తెలిసింది. దీంతో శ్రీనివాసరావు తనను ఓడించేందుకు.. పార్టీ నుంచి బయటకు పంపేందుకు కంకణం కట్టుకున్నారని ఆవేదన చెందారు. జిల్లా వెలుపల ఎప్పుడూ పోటీ చేయలేదని చెప్పారు. పవన్తో బాబుకు చాలా అవసరముంది. అతను భీమిలి సీటును ప్రకటించడంతో గంటా రాజకీయ జీవితం ప్రమాదంలో పడింది.
ఇక రాజమండ్రి రూరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవన్ వ్యాఖ్యల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది. ఇటీవల రాజమండ్రికి వెళ్లిన పవన్ రూరల్ సీట్ను తన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడైన కందుల దుర్గేష్కు కేటాయించేశారు. దీంతో టీడీపీ సీనియర్ బుచ్చయ్యకు చెక్ పెట్టినట్లయింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నానని, కష్టకాలంలో అండగా నిలిచిన తనకే సీటు ఇస్తానని చంద్రబాబు కూడా చెప్పారని పలుమార్లు మీడియా ముందు వెల్లడించారు. దుర్గేష్కు అవగాహన లేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుర్గేష్ మాత్రం పవన్ తనకు స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున సిద్ధం కావాలని చెప్పారట. గోరంట్లతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారని కొద్దిరోజుల క్రితం ఈనాడులోనే వార్త వచ్చింది. కాగా బుచ్చయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దుర్గేష్కు టికెట్ కేటాయించలేదని, జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ గురువారం విజయవాడలో జరిగిన ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో దుర్గేష్ దర్శనమిచ్చారు. ఆయనకు టికెట్ ఓకే అయింది కాబట్టే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గోరంట్ల కేడర్ను తన వద్ద నిలుపుకోవడం కోసం చంద్రబాబు ఆదేశాలతో తానే పోటీలో ఉంటానని పైకి చెప్పుకొంటున్నా.. కానీ ఎల్లో మీడియా ఈ స్థానం సేనకు కేటాయించినట్లు చెప్పేసింది. పవన్ పుణ్యాన బుచ్చయ్య కూడా రాజకీయాలకు సెలవు చెప్పాల్సిన టైమ్ వస్తోంది.
చాలా చోట్ల..
పవన్ భీమిలి సీటే కాకుండా పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని ఇటీవల చెప్పారు. ఇప్పటి వరకు బాబు టికెట్లు తమకే ఇస్తారని చొక్కాలు చించుకున్న సీనియర్లకు ఒక్కసారిగా షాక్ కొట్టింది. పెందుర్తి సీటు కోరుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గాజువాక టీడీపీ ఇన్చార్జి పల్లా శ్రీనివాసరావు ఏడుపు అందుకున్నారు. అసలు బాబు అనుమతి లేకుండా పవన్ సీట్లు ప్రకటించేంత ధైర్యం చేయడని, ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇక చింతకాయల అయ్యన్న పాత్రుడు విషయానికొస్తే రెండు సీట్లు ఆశిస్తున్నారు. కొడుక్కి అనకాపల్లి ఎంపీ అడుగుతున్నారు. ఆయనకూ బాబు చెక్ పెట్టారు. ఇక్కడ పవన్ అన్న నాగబాబు బరిలో ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో బాబు మోసం చేశాడంటూ అయ్యన్న కోపంతో రగిలిపోతున్నారు. తెనాలిలో ఆలపాటి రాజాకు నారా వారు ఇప్పటికే హ్యాండ్ ఇచ్చారు. సేనాని కోరిక మేరకు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్కు అవకాశం ఇస్తున్నారు.
చంద్రబాబు నేరుగా చెప్పకుండా పవన్ ద్వారా తెలుగుదేశం వృద్ధ నేతలకు చెక్ పెడుతున్నారని ప్రచారం ఉంది. అదే సమయంలో సేనాని టికెట్లు ఇస్తానని చాలామంది నుంచి డబ్బు వసూలు చేశారు. టీడీపీ సీనియర్లను ఎలాగూ బాబు బయటకు పంపాలని చూస్తున్నారు. దీంతో ఆ సీట్లను ప్రకటిస్తే ఏమనుకోరులే అనే భావనలో ఉన్నట్లు సమాచారం. పవన్ చెప్పింది టీడీపీలో జరగడం తెలుగు తమ్ముళ్లను కలవర పెడుతోంది. తమ పార్టీలో ఆయన పెత్తనమేంటి?, అసలు సేనాని మాట విని ఎంతో సేవ చేసిన సీనియర్లకు పొగ పెట్టడమేంటని ఆవేదన చెందుతున్నారు.
నమ్ముకున్న వారిని కూడా..
తనను చాలాకాలంగా నమ్ముకున్న వారిని చంద్రబాబు నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, శ్రీరామ్ సీట్లు అడగ్గా ఒకరికే ఇస్తానని తేల్చిచెప్పారు. దీంతో శ్రీరామ్ ధర్మవరం బరి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్ నుంచి వెళ్లిన జేసీ ఫ్యామిలీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి కుమారుల్లో ఒకరికే అవకాశం ఇస్తానన్నారు. ఆళ్లగడ్డ సీటును భూమా అఖిలప్రియకు ఇచ్చేది డౌటే. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమకు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రూపంలో బాబు షాక్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో వసంత టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో ఉమ కంగుతిన్నారు. ఇక నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావును కాదని కొలుసు పార్థసారథిని బరిలోకి దించుకున్నారు. దీంతో సీనియర్లంతా బాబు చేసిన మోసానికి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పొత్తు వద్దని చెబుతున్నా వినకుండా పెట్టుకున్నారని, ఇప్పుడు కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నారని అనుచరగణం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కొద్దిరోజుల క్రితం టీడీపీ అధినేత టెలీకాన్ఫిరెన్స్ పెట్టి త్యాగాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. సీనియర్ల త్యాగాల సీజన్ మొదలైపోయింది. పొత్తు తెలుగుదేశం సీనియర్ నేతల జీవితాలను చిత్తు చేస్తోంది. సుమారు 75 సీట్లను చంద్రబాబు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టికెట్ల ప్రకటన ఆలస్యమైందని కార్యకర్తలు బాధపడుతుంటే.. పవన్ను అడ్డం పెట్టుకుని బాబు సీనియర్లతో బంతాట ఆడుకుంటూ పార్టీని మరింత కష్టాలోకి నెట్టేస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని టీడీపీ వృద్ధులు మరోసారి రుచి చూస్తున్నారు. ఇక పార్టీ నుంచి వారి నిష్క్రమణే మిగిలింది.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ సమీకరణాల్లో భాగంగా తన పార్టీ అభ్యర్థులను నియోజకవర్గాలు మారిస్తే వెక్కిరించిన బాబు గంటాను ఏకంగా జిల్లా మార్చాలని చూస్తున్నారు. పవన్ను సాకుగా చూపించి కొందరికి ఏకంగా టికెట్లు లేవు పోండి అంటున్నారు. మరి దీనిని ఏమంటారో..