రాజకీయాల్లో మార్పు తెస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబుతుంటాడు. కానీ ఆయన మాటలు నీటిమూటలేనని తేలిపోయింది. మహిళలకు అన్యాయం జరిగితే తన రక్తం ఉడికిపోతుందని చెప్పే సేనాని ఎన్నికల సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి వారికి తీరని అన్యాయం చేశారు. పి.గన్నవరం విషయంలో ఇద్దరు మహిళలను నట్టేట ముంచేశారు.
టీడీపీ మొదట ఈ సీటును మహాసేన రాజేష్కు ఇచ్చింది. కానీ అతని వ్యవహారశైలిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గారు. చివరికి పోటీ నుంచి తప్పించారు. పి.గన్నవరంను జనసేనకు కేటాయించారు. అయితే గతంలో పనిచేసిన మహిళలను కాదని పవన్ ఈ స్థానాన్ని తెలంగాణ పోలీస్ శాఖలో అకౌంటెంట్గా పనిచేసిన గిడ్డి సత్యనారాయణ వ్యక్తికి కేటాయించారు.
2018 వరకు యన్నపు లలిత అనే మహిళకు పి.గన్నవరం టికెట్ ఇస్తామని పవన్ చెప్పాడు. దీంతో ఆమె సొంత ఆస్తులు అమ్ముకుని నియోజకవర్గంలో తిరిగింది. రూ.75 లక్షలకు పైగా ఖర్చు పెట్టారని చెబుతారు. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆమెను కాదని అప్పుడే పార్టీలోకి వచ్చిన పాముల రాజేశ్వరీదేవికి సేనాని టికెట్ కేటాయించారు. దీంతో లలిత కన్నీరుమున్నీరయ్యారు. నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి తన కుటుంబం ఐదేళ్లుగా ఎంతో కష్టపడిందని, ఆస్తిని సైతం అమ్ముకుని పనిచేశానని ఆనాడు బోరున విలపించారు. పవన్ కళ్యాణ్ని అన్నగా భావించి ఎంతో గౌరవిస్తే మోసం చేశారని, దీనిని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు.
రాజేశ్వరీదేవికి విషయానికొస్తే ఈమె గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జనసేన నుంచి పోటీ చేయగా 36 వేల ఓట్లను తెచ్చుకున్నారు. 2024లో టికెట్ వస్తుందని భారీగా ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ స్థానాన్ని సత్యనారాయణకు పవన్ అమ్మేయడంతో రాజేశ్వరి బోరును విలపిస్తున్నారు. తనను సేనాని మోసం చేశారని వాపోతున్నారు. ఈ మహిళలకు ఎక్కడైనా అవకాశాలు కల్పించి న్యాయం చేస్తాడా అంటే పవన్కు ఆ ఆలోచనే లేదని తెలుస్తోంది. చంద్రబాబుతో సావాసం చేయడంతో మోసం చేయడం సేనానికి బాగా అలవాటైనట్లు ఉంది.