‘నన్ను మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్ రూ.300 కోట్లు పంపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి. మాయమాటలకు మోసపోవద్దు’ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాటలివి. శనివారం తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను తాను అతిగా ఊహించుకుంటారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. భీమవరం, గాజువాకలో ఓడించేందుకు జగన్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని గతంలో సేనాని ఆరోపించారు. లోకేశ్ తన అన్న పవన్ బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు తనయుడు కాబట్టే లోకేశ్ను టీడీపీ నేతలు భరిస్తున్నారు. లేకపోతే ఆయన్ను లెక్క చేయరనేది నిజం. చినబాబుకు జన బలం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా బాబు దొడ్డిదారిలో మంత్రిని చేశారు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసినా ఓటమి చవి చూశారు. ఈసారి వేరే చోటుకు వెళ్లాలని చూసినా బాబు ఒప్పుకోలేదు. దీంతో అదే నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు. జగన్ పదునైన వ్యూహంతో బీసీ మహిళను రంగంలోకి దించారు. దీంతో లోకేశ్కు దిక్కుతోచడం లేదు.
ఓటమి భయం చినబాబును వెంటాడుతోంది. అందుకే భార్య బ్రాహ్మణిని కూడా రంగంలోకి దించారు. అడపాదడపా ఆమె ప్రచారం చేస్తున్నారు. ఇక లోకేశ్ అయితే మంగళగిరి నియోజకవర్గంలో పెత్తందారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఆత్మీయ సమావేశాల పెట్టి బహుమతుల ఎర వేస్తున్నారు. తనను ఓడించేందుకు రూ.300 కోట్లను జగన్ పంపారని ఆయన అన్నారు. టీడీపీ గెలిచేస్తోందని హైప్ ఇచ్చుకునే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి లోకేశ్కు రాజకీయంగా పరిణితి లేదు. మాట్లాడడం చేత కాదు. గత స్పీచ్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాసిచ్చిన స్పీచ్ కూడా సక్రమంగా చెప్పలేక అభాసుపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంగళగిరి అని పలకలేకపోయాడు.
ఓటమికి ముందే లోకేశ్ సాకులు వెతుక్కుంటున్నారని ప్రచారం ఉంది. మహిళ చేతిలో ఓడిపోతే పార్టీ నేతలు, కార్యకర్తలు చిన్నచూపు చూస్తారని, అందువల్లే రూ.300 కోట్లు పంపారని అంటున్నారని తెలుస్తోంది. అసలు చినబాబు జనం మనిషి కాదు. వారి సమస్యలను అర్థం చేసుకోలేరు. పెత్తందారీ పోకడలు ఎక్కువ. డబ్బు అవసరం లేదని, ఆయన మాటలే ఓడిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.