‘నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశాను. జగన్రెడ్డి అంత దరిద్రపు సీఎంను ఎన్నడూ చూడలేదు. అన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి’ ఉమ్మడి ఏపీకి 2010 సెప్టెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు సీఎంగా చేసిన నల్లారి కిరణ్కుమార్రెడ్డి మాటలివి.
‘ఒక అహంకారిని ఇంటికి పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. అందరి జీవితాల్లో మార్పు రావాలంటే జగన్రెడ్డిని ఓడించాలి’ ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు, విభజన రాష్ట్రంలో ఐదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలివి. ఇద్దరూ కలిసిపోయి రాయలసీమలో చేసిన ప్రచారంలో ఒకరినొకరు పొగుడుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద పడి ఏడ్చారు.
‘మేము అభివృద్ధి చేశాం.. సంక్షేమం అందించాం. అధికారంలో ఉన్నవారు ఫలానా చెప్పారు. కానీ చేయలేదు. మాకు అవకాశం ఇవ్వండి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ ఎన్నికల సమయంలో చెప్పాల్సిన మాటలివి. కానీ సీఎంలుగా పనిచేసిన ఇద్దరూ అందుకు విరుద్ధంగా మాట్లాడారు. ఇంత దరిద్రపు సీఎంను చూడలేని కిరణ్ అన్నారు. నిజం ఏంటంటే చంద్రబాబు తర్వాత రాష్ట్రాన్ని అత్యంత చెత్తగా పాలించిన సీఎం ఆయనే. కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నటించి ప్రజల మనోభావాలతో ఆడుకుని రాష్ట్ర విభజనకు కారణమయ్యాడు. ఉద్యమాలను సాకుగా చూపించి పరిపాలనను గాలికొదిలేసిన ఘనుడు. అందరూ విభజన అంశంపై ఉంటే ఈయన గారు వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారు. అందులో కొంత మొత్తాన్ని నాటి ప్రతిపక్షమైన చంద్రబాబు గ్యాంగ్కు వాటా ఇచ్చి నోళ్లు మూయించిన మేధావి. ఇక తన తమ్ముడు కిశోర్కుమార్రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా చేసుకునేందుకు లైసెన్స్ ఇచ్చి పెద్ద మనిషి. తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని చెబుతూనే అధిష్టానం కార్యాన్ని నెరవేర్చేలా చేసిన దుర్మార్గుడు. ఈయన నేడు జగన్ను అంటున్నాడు.
ఇక చంద్రబాబు విషయానికొస్తే దేశంలో అత్యంత చెత్తగా పాలించిన సీఎం ఎవరంటే మొదటి స్థానంలో ఉంటారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్రం ధ్వంసమైపోయిందని ఏడుస్తూనే ఉన్నారు. ఒక సామాజికవర్గాన్ని, పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా ఎదిగారో.. లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో.. ఈయన హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పడిపోయాయో అందరికీ తెలిసిందే. 2014 – 19 మధ్య అమరావతి పేరుతో దోచేసి ఇప్పుడొచ్చి కబుర్లు చెబుతున్నాడు. హత్యా రాజకీయాలకు ఆధ్యుడు బాబు. వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్తో అంటకాగిన వ్యక్తి.
సీఎంలుగా ఉన్నప్పుడు ఇద్దరూ ప్రజలకు చేసింది శూన్యం. వీరి పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. తమ పాలనలో ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు చెప్పుకోవడానికేం లేదు. అందుకే జగన్ మీద పడి ఏడుస్తున్నారు. పేదల కోసం ఒక్క మంచి పథకమైనా ప్రవేశపెట్టి ఉంటే దానిని చూపించి ఓట్లు అడిగేవారు. కానీ అలా చేయడం లేదంటే వీరి వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదనే కదా.. ‘నేను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి జరిగి ఉంటేనే ఓట్లు వేయండి. ఇంకా మంచి చేసేందుకు మరో అవకాశం ఇవ్వండి’ ఎన్నికల సభల్లో జగన్ మాటలివి. స్వార్థం కోసం కూటమి కట్టిన వారు ఒక వైపు.. ప్రజల్నే నమ్ముకున్న జననేత మరోవైపు. ఇద్దరి మధ్య తేడా ఇదే.