యరపతినేని శ్రీనివాస రావ్ కు సీట్ కేటాయించే విషయంలో దాగుడు మూతలు ఆడుతున్న నేపథ్యంలో గురజాల లో యరపతినేని వేయించిన ఫ్లెక్సీ సంచలనం రేకెత్తించింది. ఆ ఫ్లెక్సీ లో సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ వేసి బాబు ఫోటో వేయకుండా కనీసం పార్టీ పేరు కూడా ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.
వివరాల్లోకి వెళితే: 1994 లో కోడెల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చిన యరపతినేని శ్రీనివాసరావు మొట్టమొదటి సారి ఎమ్మెల్యే గా గురజాల నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచాడు. 1999, 2004 లో రెండు సార్లు ఓడిపోయినా చంద్రబాబు వద్ద మంచి పేరు సంపాదించుకుని బాబుకి దగ్గరివాడయ్యాడు. అందుకే వరసగా రెండు సార్లు ఓడిపోయినా 2009 లో మరోసారి టీడీపీ టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీ లో అడుగు పెట్టాడు. 2014 లో మూడోసారి ఎమ్మెల్యే గా గెలిచాడు, మంత్రి పదవి దక్కకున్నా 2015-19 మధ్య అనధికార హోమ్ శాఖా మంత్రిగా వ్యవహరించారు అనేది రాజకీయ వర్గాల్లో అందరి ఉద్దేశం.
అయితే ఈ నేపథ్యం లో 1999,2004,2014 లో మూడు సార్లు తన ప్రత్యర్ధి అయిన జంగా కృష్ణమూర్తి వైసీపీ ని వీడి టీడీపీ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుని గురజాల టీడీపీ టికెట్ ను తనకు కేటాయించాల్సిందిగా షరతు పెట్టాడు. గురజాల టీడీపీ అభ్యర్థి గా ఉన్న యరపతినేని ని నర్సారావుపేట నుండి పోటీ చేయమని కోరగా యరపతినేని ససేమిరా అనడంతో టీడీపీ మొదటి విడత అభ్యర్థుల విడుదల సమయంలో అనూహ్యంగా గురజాల సీట్ ను ప్రకటించలేదు. దాని చేత టీడీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలో లావు తో పాటు జంగా చేరాల్సి ఉండగా అది వాయుదా పడింది. ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ సీటు నుండి బీసీ వర్గానికి చెందిన జంగా సామాజిక వర్గానికే చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ పోటీలో నిలిపింది, ఎప్పటినుండో యాదవ సామాజిక వర్గం టీడీపీ కి అండగా ఉండటం, 2019 నుండి ఆ సమీకరణాలు మారడం, వైసీపీ అనూహ్యంగా యాదవ కులానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించడం తో దానికి విరుగుడుగా జంగా కు గురజాల టికెట్ ఇవ్వడం అనేది టీడీపీ కి తప్పనిసరి అయింది.
ఈ విషయం గురించి యరపతినేని కి వివరించి బతిమాలినా ఆయన వినే స్థితిలో లేడు, నర్సారావుపేట నుండి పోటీ చేయడానికి అసలే సిద్ధంగా లేడు. తద్వారా గురజాల టీడీపీ అభ్యర్థి ఎవరు అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాకపోవడంతో, యరపతినేని వేయించిన ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. తనకు టికెట్ దక్కకపోతే గురజాల నుండే ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో యరపతినేని ఉన్నట్లు సమాచారం. అందుకే బాబు బొమ్మను తప్పించి సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టించాడు అని ఇది టీడీపీ లో ముసలం అని స్థానిక టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతుంది.