నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా ఉన్న శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి ఉమ్మడి అభ్యర్ధిగా టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్ధిగా కందుల దుర్గేష్ ని జనసేన ప్రకటించింది.
కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడ తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండటం. తాను సిట్టింగ్ ఎమ్మెల్యే అవ్వడంతో కందుల దుర్గేష్ కి ఆ సీటు ఇవ్వడానికి బుచ్చయ్య ససేమిరా అనడంతో అక్కడ దుర్గేష్ ఆశల పై నీళ్లు చల్లినట్లు అయ్యింది . తొలుత రాజమండ్రి రూరల్ సీటుని పవన్ కళ్యాణ్ తనకే ఇచ్చినట్టు కందుల దుర్గేష్ మీడియా ముఖంగా ప్రకటించినా చివరికి చంద్రబాబుకి తలవంచక తప్పలేదు.
నిడదవోలు సీటు జనసేనకి ఇవ్వడంతో తెలుగు తముళ్ళు భగ్గుమంటున్నారు, సోషల్ మీడియా వేదికగా పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిడదవోలు సీటు జనసేన కి ఇవ్వడం అంటే చాల పెద్ద తప్పు, ఒకసారి ఆలోచన చేయండి. శేషారావు గారి లాంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టడం అంత మంచిది కాదంటూ తమ అభిప్రాయన్ని వెళ్ళబుచ్చుతున్నారు.
మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కందుల దుర్గేష్ కి నిడదవోలు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుండి గ్రౌండ్ వర్క్ చేసుకున్న రాజమండ్రి రూరల్ స్థానం ఇస్తే గెలిచే స్థానం అవుతుందని , ఇప్పటికిప్పుడు నిడదవోలు వెళ్లమంటే అంత సానుకూలత ఉండదని వారు ఆవేదన చెందుతున్నారు.
నిడదవోలు సీటు నిర్ణయం ఇరు పార్టీ అధినాయకులకి నచ్చినా ఇటు, జనసేన క్యాడర్ కి కానీ, అటూ తెలుగుదేశం క్యాడర్ కి కాని పెద్దగా సుముఖంగా కనిపించని ఈ తరుణంలో, ఇక్కడ ఇరుపార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. క్యాడర్ నిర్ణయానికి వ్యతిరేకంగా అధినాయకులు ఇద్దరు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి తమ తమ పార్టీల పుట్టి ముంచడం ఖాయం అనే అభిప్రాయం ఇరు పార్టీల శ్రేణుల నుండి వ్యక్తమౌతుంది.