రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవంటారు. నిజమే కావొచ్చు. బాబు వంటి వారికైతే.. తమ పని కావలసినపుడు ఉఛ్ఛం, నీచం అంటూ ఏమీ ఉండవు. కావాలంటే తానే రాళ్ళయించగలడు, పువ్వులూ వేయించగలడు. చేయి తిరిగిన పని వాడు.
2019 లో తనని తాను దేశంలోని అసంతృప్త నాయకులను ఏకం చేసి, ఏకతాటిపైకి తీసుకురాగల, ప్రధాని పదవికి అర్హత ఉన్న బలమైన నాయకుడిని అని బాబు ఫీలయిన రోజులలో…. పాపం ఆయన మోడీనీ, బీజేపీని అనరాని మాటలన్నాడు. సాక్షాత్తూ ప్రధాని పదవిలో ఆంధ్రాకి వచ్చిన మోడీకి వ్యతిరేకంగా గోబ్యాక్ అంటూ బ్యానర్లు కట్టించాడు, అమిత్షా మీద రాళ్ళేయించాడు, ఆఖరుకి బీజేపీకి వ్యతిరేకం అయిన కాంగ్రెస్తో కూడా జత కట్టాడు.
బాబు దేశంలో చక్రం తిప్పడం దేవుడెరుగు, రాష్ట్రంలో సైకిలుకున్న రెండు చక్రాలు ఊడిపోయి 23 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాలం గిర్రున తిరిగింది, పాపం బాబు కూడా ఢిల్లీ చుట్టూ తిరిగాడు. ఈ సారి మోడీని అష్టదిగ్భంధనం చేయించే పనులేమీ పెట్టుకోకుండా, ప్రసన్నం చేసుకోవడం కోసం మూడేళ్ళుగా ప్రయత్నించి, ఎట్టకేలకు పొత్తులోకి తీసుకురాగలిగాడు.
కానీ, నాడు బాబు అన్న మాటలు నేడు మోడీకి ఇంకా గుర్తున్నాయా? నాటి విద్వేషం మరిచి విరహంతో బాబు మోడీ చెంతకు చేరినా, మోడీ ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నాడా? ఏపీ బీజేపీ, జనసేన నాయకులు ఇరువురూ బలవంతం చేయడంతో పొత్తు కుదుర్చుకున్నా, కూటమికి ప్రధాన శత్రువు అయిన వైసీపీని విమర్శించకుండా, సభలో కనీసం వైసీపీ ప్రస్తావన లేకుండా తూతూమంత్రంగా మోడీ నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం వెనుక ఆంతర్యం అదేనా?? అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయ్.
మోడీ సభలో ఎక్కడా… ఆంధ్రాలో పాలన బాలేదని అనలేదు, బాబు & కో అరాచక పాలన అని గుండెలు బాదుకుంటున్నా… కనీసం మోడీ అలా ఫీలవలేదు. వైసీపీ విధి విధానాలని విమర్శించలేదు. పోనీ బాబుకి ఉన్నది విజనరీ కాబట్టి ఆయనే సీయం కావాలని అనలేదు. జగన్కి సీయం అయ్యే అర్హత లేదు అనలేదు. ఏదో మేనరికం పెళ్ళి చూపులులా నామమాత్రంగా సభలో మాట్లాడేసి వెళ్ళిపోయారు.
తల్లిని చూడడు, హార్డ్ కోర్ ఉగ్రవాది, అమిత్షా హంతకుడు, మోడీకి ఏం తెలుసు కుటుంబం విలువ… ఇలా ఒకటా రెండా బాబు పేలిన అవాకులు చెవాకులు. వీటన్నిటినీ అనేసిన బాబు వాటి గురించి మరిచిపోయినా, మాట పడ్డ మోడీ మాత్రం ఇంకా మరిచిపోలేనట్టే ఉంది, ఆయన వ్యవహరించిన తీరు చూసిన ప్రతి ఒక్కరికీ!!