Nara Lokesh: మీ పేర్లన్నీ ఈ ఎర్ర బుక్కులో రాసుకున్నా. మేం అధికారంలోకి రాగానే అంతుచూస్తా..’ అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh) పాదయాత్ర సమయంలో బెదిరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై న్యాయస్థానాల్లో వాంగ్మూలం ఇచ్చిన కీలక సాక్షులు, అధికారులు పేర్లు ఎర్ర బుక్కులో రాశానని, వారి సంగతి చూస్తానంటూ సభల్లో, మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేగింది. పలు కుంభకోణాలకు సంబంధించి విచారణ సందర్భంగా ఇచ్చిన 41ఏ నోటీసులకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరించ సాగారు.
దీంతో ఏపీ సీఐడీ కోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. తాజాగా కేసును విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. రెడ్బుక్ పేరుతో సాక్షులను బెదిరస్తున్న లోకేశ్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరింది. ఈ కేసులో జారీ చేసిన నోటీసులు తీసుకునేందుకు ఆయన సుముఖత చూపలేదు. ఇంటికి పంపినా తీసుకోలేదు. వాట్సాప్కు పంపినా స్పందించలేదు. ఈ అంశాలను అధికారులు కోర్టు ముందు ఉంచారు. దీంతో న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపాలని జడ్జి ఆదేశించారు. లోకేశ్, లేదా ఆయన న్యాయవాదులు విచారణకు హాజరుకావాలన్నారు. కాగా కౌంటర్ దాఖలుకు గడువు కావాలని లోకేశ్ లాయర్లు కోరడంతో కేసును 6వ తేదీకి వాయిదా వేశారు.