మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని నివాసంలో చేనేత సొసైటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నారా లోకేష్ వ్యాఖ్యలపై మంగళగిరిలోని చేనేత కార్మికులు మండిపడుతుండడం గమనార్హం. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అనంతరం చంద్రబాబు దొడ్డి దారిలో లోకేష్ ని ఎమ్మెల్సీని చేసి మూడు మంత్రి పదవులు కట్టబెట్టారు.
2014 నుండి 2019 వరకూ మూడు శాఖలకు మంత్రిగా ఉన్న లోకేష్, అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మాత్రం అభివృద్ధి చేస్తా అంటూ ఆవు పులి కథలు చెప్తుండడం చూసి మంగళగిరి వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ముసుగులో దళితుల దగ్గర నుండి భూములు లాక్కోవడంలో బిజీగా గడిపిన లోకేష్ కు తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడంతో రియాలిటీలోకి వచ్చాడు. మూడు శాఖలకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి లోకేష్ కి మనసు రాలేదు.
నేతన్నలు ఓట్లను కొల్లగొట్టేందుకు 2014లో లెక్కలేనన్ని హామీలను టీడీపీ గుప్పించింది. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని, రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని, మగ్గం షెడ్డు కట్టిస్తామని,ఒక్కో కుటుంబానికి రూ.లక్ష బ్యాంకు రుణాలిస్తామని, ప్రతీ ఏటా బడ్జెట్లో రూ.1000 కోట్లు ఏటా కేటాయిస్తామని లెక్కలేనన్ని హామీలిచ్చి తీరా గెలిచాక నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గాలికి వదిలేశారు. దీంతో నేతన్నల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. మూడు శాఖలకు మంత్రిగా చేసిన లోకేష్ కనీసం నేతన్నల జీవితాలను వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు.
కానీ జగన్ అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకోవడానికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు సాయంగా అందిస్తూ నేతన్నలను ఆదుకున్నారు. ఇలా ఐదేళ్ళలో రూ.969.77 కోట్లు సాయం చేస్తుండం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. ఆఖరికి కరోనా సమయంలో కూడా ఈ సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం ఆపలేదు. ఒక్క నేతన్న నేస్తంతోనే కాకుండా వివిధ రకాల సంక్షేమ పథకాలతో చేనేత కుటుంబాలకు 3000కోట్లకు పైగానే లబ్ది చేకూర్చింది జగన్ ప్రభుత్వం..
నేతన్నలకు సాయం చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరించిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అధికారంలో ఉన్నన్ని రోజులు చేనేత కార్మికుల బాధలను పట్టించుకోకుండా ఇప్పుడు కొత్తగా తాము చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పుకోవడం లోకేష్ కుటిల మనసుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మాత్రం మంగళగిరిలో చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీలిస్తున్న లోకేష్ తీరును చూసి మంగళగిరిలోని చేనేత కార్మికులు మండిపడుతున్నారు.