గతంలో అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట హైదరాబాద్ లాంటి నగరంలో కేంద్రీకృతం చేయడం ఎంత విపత్తుకు దారితీసిందో అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్లీ అదే తప్పును పునరావృతం చేయడం సమంజసమా? అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుంది. కానీ ఒకే చోట పరిమితం అవ్వటం వలన మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకపోగా ఇంకా ఇంకా వెనకబడిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిమితం కాకుండా సర్వతో ముఖాభివృద్ధిగా రాష్ట్రమంతా అభివృద్ధి చెందేలాగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో గతంలో హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో జరిగితే రాష్ట్రప్రగతి మరింత ఇరుకున పడుతుంది. అలా జరగకుండా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు నడవాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులకు శ్రీకారం చుట్టాడు సీఎం జగన్. గతంలో హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటును సరి చేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి ప్రాంతీయ సమానతలకు తావు లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. తద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం కోసం మార్గాన్ని వేశాడు.
అయితే తన వ్యక్తిగత స్వార్థం కోసం ఓటుకు నోటు కేసులో పట్టపగలు నిస్సిగ్గుగా దొరికి, విభజన చట్టంలో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదును సైతం వదిలేసి రాత్రికి రాత్రి కరకట్టకు పారిపోయి వచ్చాడు చంద్రబాబు. అమరావతి రాజధాని పేరుతో భూదందాకు తెరలేపిన చంద్రబాబు కోర్టుల ద్వారా మూడు రాజధానులకు మోకాలు అడ్డాడు. తన తొత్తులతో కేసులు వేయించి మూడు రాజధానులు నిర్ణయం ముందుకు సాగకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే వస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత వెనకబడిన రాష్ట్రాన్ని ప్రగతి పధంలో ముందుకు తీసుకెళ్లాలి అంటే కచ్చితంగా రాజధాని అనేది ఒకే చోట ఉండకూడదు. అన్ని ప్రాంతాలకు సమానంగా అవకాశాలు కల్పించే ఎలాంటి అసమానతలు లేకుండా అభివృద్ధికి దారులు వేసే మూడు రాజధానులు నిర్ణయమే సరైనదని ప్రజలు గుర్తించి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.