దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ గారు నిజం గెలవాలి అంటూ చేస్తున్న పర్యటనల్లో ఆమె చేస్తున్న ప్రచారం అసత్యాలు అర్ధసత్యాలతో సాగుతుంది. చంద్రబాబు గత 25ఏళ్లగా చెప్పుకుంటూ వస్తున్న అబద్దపు మాటలే ఈమె కూడా వల్లెవేస్తుంది. తమకి సొంతం కాని తమ ప్రమేయం లేని పనులు తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకి వెన్నతోపెట్టిన విద్య. ఆ విద్యనే భువనేశ్వరీ కూడా కొనసాగిస్తుంది.
చిత్తూరు జిల్లా శాంతిపురంలో ‘ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ’ అంశంపై మహిళలతో ముఖాముఖి మాట్లాడిన భువనేశ్వరీ గారు చెప్పిన మాటలు వింటే చంద్రబాబు డాంబికాలకి ఏమాత్రం తీసిపోవు. డ్వాక్రా సంఘాలను తెచ్చింది చంద్రబాబని, మహిళలకు ఆస్తిలో సమాన హాక్కు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆర్ అని, మళ్ళీ చంద్రబాబు వస్తే మహిళలకి మంచి రోజులు వస్తాయని ఊకదంపుడు ఉపన్యాసలు ఇచ్చారు.
అయితే నారా భువనేశ్వరీ గారి మాటల్లో అర్ధసత్యాలతో పాటు ఎన్నో అసత్యాలు కూడా మెండుగానే ఉన్నాయని ఆ ప్రసంగం విన్న రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట ..మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్ అనేది అర్దసత్యమని తొలుత 1983లో అధికారంలోకి వచ్చిన రామారావు ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించినప్పటికి శాసన సభలో ఆమోదం పొందింది కానీ మండలిలో ఆమోదం పొందలేదు.. ఈ బిల్లుని ఆమోదించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని సభ్యులు లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న నాటి మండలి స్పీకర్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేశారు, మండలి రద్దు తరువాత 1985 సెప్టెంబర్ 5న ఈ బిల్లును తిరిగి అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది నాటి రామారావు ప్రభుత్వమే అయినప్పటికి ఇది అమలుకు నోచుకోలేదు. గవర్నర్ ఆమోదం పొందలేదు . అయితే నిజానికి ఈ మహిళ ఆస్తి హక్కు చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది 2005లో మన్మోహన్ సింగ్ ఆద్వర్యంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే భువనేశ్వరీ గారు రామారావు పాలన్లోనే అమల్లోకి వచ్చినట్టు మాట్లాడటం హాస్యాస్పదం.
అలాగే డ్వాక్రా సంఘాలు కూడా చంద్రబాబే తెచ్చారు అనడం మరో పచ్చి అబద్దం. నిజానికి డ్వాక్రా సంఘాలు పెట్టింది నాటి ప్రధానిమంత్రి ఇందిరా గాంధీ గారు, 1982లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అంటే ఇందిరా గాంధీ గారి నేతృత్వంలో మహిళలు, పిల్లల అభ్యుదయం కోసం దేశంలోని 50 జిల్లాల్లో ఈ డ్వాక్రాను స్థాపించి మహిళల్లో ఆర్థికంగా, మానసికంగా వాళ్లలో చైతన్యం తీసుకురావాలని ఈ స్కీం ను ప్రవేశపెట్టారు. అప్పుడు చంద్రబాబు కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే. ఈ డ్వాక్రా పథకం గురించి కూలంకషంగా పరిశీలిస్తే.. ఈ వ్యవస్థ విస్తృతం కావడంలో పీవీ నరసింహరావు గారి కృషి ఉంది.. మన ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే మహిళాభ్యుదయ దిశగా పీవి నరసింహారావు గారి సంస్కరణల ఫలితంగా 15 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే డ్వాక్రా వ్యవస్థ కుదేలయ్యి, డ్వాక్రా మహిళలు అప్పుల పాలు కావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తా అని 2014 ఎన్నికల్లో గెలిచిన బాబు ఆ తర్వాత ఆ హామీకి తిలోదకాలు ఇవ్వడం వలన 2014 నాటికి రూ.14,204 కోట్లుగా ఉన్న మహిళా సంఘాల అప్పులు అసలు వడ్డీ కలిపి తడిసిమోపిడై 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ తుది నివేదిక ప్రకారం రూ.25,517 కోట్లకు చేరాయి.
వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబే డ్వాక్రా సంఘాలని తెచ్చాడని చెప్పుకుంటూ భువనేశ్వరీ తిరగడం జుగుప్సాకరం.. ఇప్పటికైన భువనేశ్వరి గారు చంద్రబాబు బాట పట్టకుండా ప్రసంగాల్లో కొంచమైన నిజాలు చెబితే నవ్వులపాలు కాకుండా ఉంటారు.