అనకాపల్లి పార్లమెంట్ సీట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కన్నుపడిందా.. దీనికి రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. ఇక్కడ పోటీ చేయాలని తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వకపోతే తనకు అనకాపల్లిలో అవకాశం ఇవ్వాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రక్తంతో కూడా బాబు పేరు రాసి తన కోరికను వెల్లడించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును నాకు ఇప్పించాలని నాగబాబు తమ్ముడిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపన అధ్యక్షుడు హరిరామజోగయ్య అనకాపల్లి సీటు అడగాలని పవన్కు లేఖల ద్వారా చాలాసార్లు సూచించారు.
ఈ మధ్యే చంద్రబాబు త్యాగాలు చేయాలని తన పార్టీ నేతలకు చెప్పారు. కానీ వారు భగ్గుమంటున్నారు. అయ్యన్న పాత్రుడు ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు ఈ సీటు తన కొడుక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్నామని, అడిగే హక్కు తమకే ఉందన్నారు. బయట నుంచి వచ్చే వారికి ఇస్తే ఒప్పుకోమని అటు బుద్ధా, ఇటు నాగబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే వెంకన్న బీసీ కార్డు వాడుతూ తనకు చంద్రబాబు న్యాయం చేయాల్సిందే అంటున్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా పార్టీలు తిరిగిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి సీటును ఆశించి జనసేనలో చేరారు. అయితే నాగబాబు రంగప్రవేశం చేయడం, ఆయన యలమంచిలిలో ఇల్లు తీసుకోవడంతో టికెట్ ఇచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ అన్న కావడంతో చంద్రబాబు నో చెప్పరని అంటున్నారు. దీంతో కొణతాల అలిగారు. తనను సేన నాయకత్వం మోసం చేసిందని సన్నిహితులతో వాపోయారు. సోమవారం పవన్ వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే కొణతాల టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నారని సమాచారం.
నాగబాబుది తన తమ్ముడి లాగే స్థిరత్వం లేని మనస్తత్వం. ఏది పడితే అది మాట్లాడుంటారు. గతంలో చంద్రబాబు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణను వ్యంగ్యంగా మాట్లాడి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు. పవన్ పూనుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది. నాగబాబు 2019లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. రాజకీయంగా ఆకాంక్షలు ఉన్నా జనంలో ఏ మాత్రం బలం లేదు. చిరంజీవి పేరు చెప్పుకొని తిరగాల్సిందే. ఈయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి అల్లు అరవింద్ ఇక్కడ పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఇక్కడ నిలబడితే ఓడిపోతారని వారి వాదన. అయ్యన్న పాత్రుడు కూడా తన కొడుక్కి అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కానీ ఫలితం కనిపించేలా లేదు. కొణతాలకు కూడా ఇవ్వరు. దీంతో నాగబాబే అభ్యర్థి అని జనసైనికులు ప్రచారం చేస్తున్నారు. నోటిదురుసు గల ఈయన పొత్తులోని పార్టీలను కలుపుకొనిపోయి గెలవడం కత్తిమీద సాము లాంటిదే. మేము సహకరించేది లేదని ఇప్పటికే అయ్యన్న తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో బాబు, పవన్ ఏమి చేస్తారో..