టికెట్లు దక్కని నేతలు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారారు. ఎన్నికల్లో వారి నుంచి సహకారం ఉండదని భయపడ్డారు. అలాగే నిరసనలు ఆపించి మచ్చిక చేసుకునేందుకు ఎత్తులు వేశారు. ఎందుకూ ఉపయోగపడని పార్టీ పదవులు కట్టబెట్టారు. దాంతోపాటు కొందరికి అభ్యర్థుల ద్వారా భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు సమాచారం.
విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా గండి బాబ్జిని నియమించారు. ఈయన విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. చివరికి బాబు బుజ్జగించి న్యాయం చేస్తానని పార్టీ పదవి చేతిలో పెట్టారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కొవ్వూరు నుంచి పోటీ చేయాలని భావించారు. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా అధిష్టానం నిరాకరించింది. ముప్పిడి వెంకటేశ్వరరావు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో బాబు ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి మమ అనిపించారు. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకటరాముడు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్నె సుబ్బారెడ్డి, కొవ్వలి రామ్మోహన్ నాయుడు, కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు, వాసురెడ్డి ఏసుదాసును నియమించారు. ఇంకా మరికొన్ని నియామకాలు ఉంటాయని తెలిసింది.
ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని నారా వారు చాలామంది చేత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. అయితే బీజేపీ, జనసేనతో కూటమిని సాకుగా చూపించి సీట్లు ఎగ్గొట్టారు. అలాగే మరికొన్ని చోట్ల సర్వేల పేరుతో కొత్త వారిని తెరపైకి తెచ్చారు. డబ్బు తీసుకుని టికెట్లు కేటాయించారు. దీంతో అశావహులు అధిష్టానంపై గుర్రుగా ఉండగా ఎలాగోలా బుజ్జగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ పదవులు ఎర వేసినట్లు తెలిసింది. కాగా పలువురికి అభ్యర్థుల చేత డబ్బులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.