రా కదలి రా, శంఖారావం, జయహో బీసీ, ప్రజాగళం, తాడేపల్లిగూడెం సభలకు అటు జనం.. ఇటు పార్టీల నాయకులు కార్యకర్తల నుంచి స్పందన కరువవడంతో తెలుగుదేశం సీనియర్ నేతలకు కొత్త భయం పట్టుకుంది. సభలు పెట్టొద్దని అధినేత చంద్రబాబు నాయుడిని కోరినట్లు సమాచారం. సోమవారం ఉండవల్లిలో బాబును కొందరు నేతలు కలిశారు. ఈ సమయంలో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలపై చర్చించారు.
అభ్యర్థులకు పదేపదే చెప్పినా జనసమీకరణ చేయడంలో విఫలమయ్యారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు పరువుపోయిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారట. బస్సులు పంపి మద్యం, డబ్బు పంపిణీ చేసినా టీడీపీ కార్యకర్తలు రాలేదని నేతలు జవాబిచ్చారని సమాచారం. జనసేన, బీజేపీ కార్యకర్తల నుంచి స్పందన కరువైందని, వచ్చిన కొద్దిమందిలో మనవారే ఎక్కువ మంది ఉన్నారని అధినేతకు సర్ది చెప్పారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్డీఏలోకి వెళ్తే మొదటి సభను ఇంత దారుణంగా చేశారని, కనీసం పుష్పగుచ్ఛాలు, శాలువాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారని, అన్నీ తాను చూసుకోవాలంటే ఎలా అన్ని బాబు ప్రశ్నించారని చెబుతున్నారు.
ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు పెడితే ఎలా ఉంటుందని సమావేశంలో మాట్లాడుకున్నారు. కొందరు పక్కా ప్లానింగ్తో పెడితే బాగుంటుందని అభిప్రాయపడగా.. మరికొందరు ఆ ఆలోచనే వద్దని.. బహిరంగ సభలు మనకు అచ్చిరావడం లేదని చెప్పారట. చాలామంది అభ్యర్థులు తమకేం పట్టనట్టు ఉన్నారని, నేతలు, కార్యకర్తల్ని తరలించడం సాధ్యమయ్యే పనికాదని, అందువల్ల సభలు వద్దని తేల్చి చెప్పారని సమాచారం. కానీ చంద్రబాబు వినలేదని, పొత్తులో మనమే బలవంతులమని, అలాంటిది వెనుకడుగు వేస్తే జనసేన, బీజేపీ దృష్టిలో చులకన అయిపోతామని అన్నారని తెలిసింది. సభలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
చాలామంది నేతలు టీడీపీ సభల పేరు చెబితే వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఇరుకు సందుల్లో అయితే ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చని, ఖాళీ ప్రదేశాల్లో సభలంటే తమ వల్ల కాదని చేతులేత్తుస్తున్నారు. అందువల్లే రా కదలి రా, శంఖారావం సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరి ప్రజాగళం సభల్ని కొనసాగిస్తారో.. లేక ఈసారి కూడా ఇరుకు సందుల్ని ఎంచుకుంటారో..