వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడి రైతులను ఏనాడూ పట్టించుకోలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 14 ఏళ్ల పాలనా కాలంలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటి? విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటని తీవ్ర విమర్శలు చేశారు.
వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు
సీఎంగా చంద్రబాబు పనిచేసిన 14 ఏళ్లలో అన్నదాతలకు చంద్రబాబు చేసిన మేలు ఏమిటి? రైతులు సమస్యలు చెప్పుకోవటానికి వెళ్తే బుల్డోజర్లతో తొక్కించాలన్న వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడిందే కాకుండా వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. చంద్రబాబు హయాంలో ఏమైనా ఆయకట్టు సాగు పెంచారా? ప్రకృతి విపత్తుల వల్ల రైతులకు నష్టం జరిగితే.. రైతులు ఎవరైతే బీమా ప్రీమియం కడితారో వారికి ప్రభుత్వ వాటా చెల్లిస్తానని చెప్పి బీమా రాకుండా రైతులను ముంచింది చంద్రబాబు. ఈరోజు రైతు పంట వేసుకుంటే.. నోటిఫై పంటలకు ఈక్రాప్ బుకింగ్ చేయించి పారదర్శకంగా వారికి సంబంధించిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా చంద్రబాబు హయాంలో లేదు. చంద్రబాబు వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టారు. టీడీపీ హయాంలో విత్తనాలు కోసం క్యూ లైన్లో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి రాష్ట్రంలో రైతులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ఆరోపణలు
చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీ విషం చిమ్ముతున్నారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సహాయక చర్యలు సమర్ధవంతంగా కొనసాగాయి. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పర్యటనలు చేసాడు కానీ తుపాను విషయంలో ప్రభుత్వం ఎక్కడ ఏవిధంగా విఫలమైందో స్పష్టంగా చెప్పలేకపోయాడు. చంద్రబాబు మైక్ తీసుకుని ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తు బురదజల్లుతున్నారు. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీ విషం చిమ్ముతూ, ఒకరు యాక్షన్ మరొకరు డైరెక్షన్ చేస్తున్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చంద్రబాబు నైజం. ప్రజలతో మమేకమయ్యే నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి. కందిపప్పుకి, పెసర పప్పుకి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు నేను సిద్ధం.. దమ్ముంటే చంద్రబాబు నాతో చర్చకు రావాలి. తేదీ, టైమ్, ప్లేస్ చెబితే వస్తాను. నా సవాల్ను చంద్రబాబు స్వీకరించాలి అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.