మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ప్రతి నియోజకర్గంలో ప్రజలు సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఆయన పలు సభల్లో పాల్గొని ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు ఎంత మోసగాడో వివరించారు. తన పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సభ నిర్వహించిన సీఎం గురువారం రాత్రి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. చింతరెడ్డిపాళెం వద్ద ఏర్పాటు చేసిన బసలో శుక్రవారం విశ్రాంతి తీసుకున్నారు. శనివారం అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది.
కోవూరు, సున్నపుబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు జగన్ చేరుకుంటారు. కొంతసేపు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి బైపాస్ వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిశాక ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాళెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. జగన్ను మరోసారి అక్కున చేర్చుకునేందుకు నెల్లూరు జిల్లా సిద్ధమైంది. అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.